పెళ్లి ఫ్లెక్సీ తొలగిస్తుండగా ప్రమాదం
విద్యుదాఘాతంతో తండ్రీ కొడుకుల మృతి
వారం క్రితమే కొడుకు పెళ్లి
హసన్పర్తి: పెళ్లికి ఏర్పా టు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తున్న తండ్రీ కొడుకులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమారంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు భార్య రమాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శరత్ (32) వివాహం వారం రోజుల క్రితం జరిగింది.
పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు కురవడంతో సాంబయ్య ఆ ఫ్లెక్సీ తొలగించడానికి ఉపక్రమించాడు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తండ్రిని రక్షించడానికి వెళ్లిన శరత్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు.


