‘ఫిరాయింపుల’పై కేసీఆర్‌తో ఏజీ భేటీ | AG met cm chandrasehkar rao | Sakshi
Sakshi News home page

‘ఫిరాయింపుల’పై కేసీఆర్‌తో ఏజీ భేటీ

Nov 5 2016 3:04 AM | Updated on Sep 2 2018 5:24 PM

టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్, శాసనసభావ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు సమాలోచనలు జరిపారు. శుక్రవారం సీఎం అధికారిక నివాసానికి అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారె డ్డిని పిలిపించి చర్చించారు. ఈ నెల 8లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలంటూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి సుప్రీంకోర్టు సూచిం చిన నేపథ్యంలో కోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై చర్చించేందుకు, న్యాయ సలహా పొందేందుకు కేసీఆర్, హరీశ్‌రావులు ఏజీని పిలిపించి చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే పూర్తి విచక్షణాధికారం స్పీకర్‌కే ఉన్నా న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఈ వ్యవహారంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సమాధానం ఇవ్వాల్సిన అవసరంపై చర్చించారని సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) విప్, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశంపైనా కేసీఆర్, హరీశ్‌రావు చర్చించుకున్నట్లు అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement