ముగ్గురిని ఒకేసారి విచారిస్తే..! | ACB to be investigated three offenders on note for vote case at once | Sakshi
Sakshi News home page

ముగ్గురిని ఒకేసారి విచారిస్తే..!

Jul 8 2015 1:25 AM | Updated on Aug 17 2018 12:56 PM

‘ఓటుకు కోట్లు’ కేసులో ఇప్పటివరకు వెల్లడికాని పలు అంశాలను వెలికితీసేందుకు ఏసీబీ చర్యలు చేపడుతోంది.

* 'ఓటుకు కోట్లు’లో కీలక ఆధారాలు వెలికితీసే దిశగా ఏసీబీ నిర్ణయం
* ఏకకాలంలో సండ్ర, జిమ్మి, వేం నరేందర్‌ల విచారణ

 
 సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇప్పటివరకు వెల్లడికాని పలు అంశాలను వెలికితీసేందుకు ఏసీబీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సండ్రను కస్టడీలోకి తీసుకోవడంతో పాటు అజ్ఞాతంలో ఉన్న జిమ్మిబాబును అదుపులోకి తీసుకోవాలని, వీరితో పాటు వేం నరేందర్‌రెడ్డిని రప్పించి ముగ్గురినీ ఏకకాలంలో విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. తమకు లభించిన సమాచారంతో ఇప్పటికే సండ్రను విచారించగా వేటికీ తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నింటికి  ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు సమాచారం.  వేం కూడా ఇంచుమించు ఇదేతీరులో వ్యవహరించారు.
 
 దీంతో ముగ్గురిని ఒకేసారి విడివిడిగా, ముఖాముఖి విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలా చేస్తే ఈ వ్యవహారం వెనుక అసలు కుట్ర, సూత్రధారి బయటకు వస్తారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.నోటీసులు జారీ చేసినా స్పందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు విషయంలో ఏసీబీ సీరియస్‌గా ఉంది. ఆయనకు 49ఏ కింద నోటీసులు జారీ చేసినందున.. ఆయన ఆచూకీ ఎక్కడ లభించినా అదుపులోకి తీసుకోవాలని భావిస్తోంది.
 
 మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించిన జిమ్మిబాబు.. కోర్టును ఆశ్రయిస్తే ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు సూచించడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ముఖ్యనేతలకు తొలుత మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి జిమ్మిబాబేనని ఏసీబీకి  సమాచారం ఉంది. జిమ్మిని అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారాన్ని రాబట్టవచ్చని ఏసీబీ భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement