ఎయిడ్స్‌కు 4,250 మంది బలి | 4250 killed with AIDS In Telangana | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌కు 4,250 మంది బలి

Feb 22 2020 2:08 AM | Updated on Feb 22 2020 2:08 AM

4250 killed with AIDS In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎయిడ్స్‌కు తెలంగాణలో అనేకమంది బలవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్‌ మరణాల్లో మన రాష్ట్రం ఏకంగా నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్‌ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

2018– 19 ఆర్థిక ఏడాదిలో 2,925 మంది తెలంగాణలో ఎయిడ్స్‌ కారణంగా చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో గత డిసెంబర్‌ నాటికే  4,278 మంది చనిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంటే గత  సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే ఇంతమంది చనిపోవడం గమనార్హం. మరణాల్లో పెరుగుదల 32%అధికంగా ఉంది. దేశంలో ఎయిడ్స్‌ కారణంగా మరణించిన వారిలో దాదాపు పదో వంతు ఉండటం గమనార్హం. ఇక 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం  ప్రకారం గతేడాది డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు. 

సెక్స్‌ వర్కర్లలో అధికం..
సెక్స్‌ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17%, లింగమార్పిడి 15%, మిశ్రమ సమూహాలు 12%, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. 25 శాతం మంది మాత్రమే కండోమ్‌ వాడుతున్నారని ఓ అంచనా . ఎయిడ్స్‌ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్‌ కమల్‌నాథ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement