నలుగురు స్నేహితుల్ని మింగేసిన రాకాసి అల

Birthday Celebration Leads Tragedy 4 Drown In Sea Of Tiruvottiyur - Sakshi

తమిళనాడులో దుర్ఘటన

సాక్షి, చెన్నై: ఓ మిత్రుడి పుట్టినరోజు వేడుక నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బర్త్‌ డే పార్టీకి వచ్చిన నలుగురు మిత్రులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. అందులో ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు చేరగా..మరో మృతదేహం కోసం గాలింపు సాగుతోంది. తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలోని మనలి బల్జిపాళయంకు చెందిన రాకేష్‌ (15) పుట్టినరోజు వేడుక శనివారం అయ్యింది. ఈ వేడుకలో పాల్గొనడానికి 8 మంది మిత్రులు రాకేష్‌ ఇంటికి శనివారం వచ్చారు. రాకేష్‌తో కేక్‌ కట్‌ చేయించి మధ్యాహ్నం ఎన్నూరు సముద్ర తీరంలోని కేవీకుప్పుం వద్దకు వెళ్లారు.

అక్కడ ఐదుగురు మిత్రులు ఒడ్డునే ఉండిపోగా ధనూష్‌ (15), జయభారతి (15), గోకుల్‌నాథన్‌ (15), సునీల్‌కుమార్‌ (15) మాత్రం సముద్ర స్నానానికి వెళ్లగా ఓ రాక్షస అల వీరిని మింగేసింది. స్నానం చేస్తున్న మిత్రులు కనిపించకపోవడంతో ఒడ్డునున్న మిగిలిన మిత్రులు భయంతో కేకలు పెట్టగా..జాలర్లు వచ్చి ఆ నలుగురు కోసం గాలించారు. ధనూష్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలో ఓ మృతదేహం బయటపడగా, మరో మృతదేహం ఒడ్డుకు చేరింది. ఆ ఇద్దరినీ జయభారతి, సునీల్‌కుమార్‌గా గుర్తించారు. గోకుల్‌నాథ్‌ కోసం గాలిస్తున్నారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top