
గంగావతి: భార్యను హత్య చేసి తానూ ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని వడ్డరహట్టి క్యాంప్లో సోమవారం చోటు చేసుకుంది. గంగావతిలోని కిల్లా ఏరియాకు చెందిన అఫ్రోజ్(28) నగరంలోని గుండమ్మ క్యాంప్కు చెందిన మైబూబీ(35)లు ప్రేమించుకున్నారు. మైబూబీ తల్లిదండ్రులు వయస్సు వ్యత్యాసం ఉన్న కారణంగా వివాహానికి అనుమతించ లేదు. దీంతో ఇరువురు కుటుంబాల పెద్దలను ఎదిరించి వారు వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం వడ్డరహట్టి క్యాంప్లో కాపురం పెట్టారు. వివాహం అయిన ఐదు నెలలకే వీరి మధ్య అంతర్గత కలహాలు ఏర్పడటంతో అఫ్రోజ్ తన భార్యను హత్య చేసి తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై గంగావతి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.