మళ్లీ పెళ్లి వద్దందని తల్లినే చంపాడు! | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి వద్దందని తల్లినే చంపాడు!

Published Wed, May 3 2017 3:30 PM

teacher killed his mother for objection to his marrage

తంజావూరు(తమిళనాడు): మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే అడ్డుచెప్పిందని తల్లినే చంపాడో రాక్షసుడు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో కాదు.. భావిపౌరులను తీర్చిదిద్దే ఓ ప్రధానోపాధ్యాయుడు. తమిళనాడు తంజావూరులోని శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన కె.త్యాగరాజన్‌(57) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే, కొంతకాలం క్రితం అతని భార్య ఎటో వెళ్లిపోయింది.

దీంతో త్యాగరాజన్‌ మళ్లీ పెళ్లికి సిద్ధపడ్డాడు. అతని తల్లి(80) మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మళ్లీ పెళ్లి వద్దని వాదించింది. ఈ విషయమై ఏప్రిల్‌ 20వ తేదీన తల్లి, కొడుకు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఉన్న త్యాగరాజన్‌ తల్లి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మరునాటి ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లిని ఎవరో చంపారని ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కళ్లలో కారం చల్లి ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొడుకు త్యాగరాజన్‌ను అనుమానించారు. విచారణలో అతడు నిజాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకుంటానంటే అడ్డు చెప్పిందని చంపేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement