గడువు ముగిసిన షాపింగ్ సెంటర్లలోని దుకాణాలను వేలం పాట ద్వారా కేటాయిస్తామని షోలాపూర్ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ స్పష్టం చేశారు.
షోలాపూర్, న్యూస్లైన్: గడువు ముగిసిన షాపింగ్ సెంటర్లలోని దుకాణాలను వేలం పాట ద్వారా కేటాయిస్తామని షోలాపూర్ మున్సిపల్ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్ స్పష్టం చేశారు. గడువు ముగిసి పోయినప్పటికీ సదరు దుకాణాదారులు తమ వ్యాపారాన్ని అలానే కొనసాగిస్తున్నారని తెలిపారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని అనుసరించి ఈ వేలంపాటను కొనసాగిస్తామన్నారు.
సదరు షాపింగ్ సెంటర్లోని దుకాణాదారులతో ఇంతకు ముందే సమావేశం నిర్వహించామన్నారు. కాగా, ఈ దుకాణాల వేలం విషయమై స్టాండింగ్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని చెర్మైన్ బాబా మేస్త్రి స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, 2010 మార్చిలోనే పట్టణంలోని 460 దుకాణాల గడువు ముగిసిందని తెలిపారు. వీటిలో మేజర్, మినీ షాపింగ్లున్నాయని, ఆయా దుకాణాల్లో అనేకమంది బోగస్ అద్దె దుకాణాదారులు కూడా ఉన్నారన్నారు. గడువు ముగిసిన దుకాణాలకు వేలం వేయడం ద్వారా ఎస్ఎంసీకి ఆదాయం సమకూరనుందన్నారు.
కాగా, 1,460 దుకాణాల్లో 601 మేజర్ దుకాణాలు ఉన్నాయన్నారు. ముందుగా మేజర్ దుకాణాల వేలం పాట నిర్వహిస్తామనీ, ఈ వేలంలో అందరూ పాల్గొనవచ్చునన్నారు.రూ.వెయ్యి చెల్లించి వ్యాపారులు వేలం ఫారాలు పొందవచ్చని తెలిపారు. వాటిని పూరించి కార్యాలయంలో అందజేయాలని చంద్రకాంత్ అన్నారు. కాగా, ఈ నెల 20వ తేదీన ఫారాలు విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.