నేడు రాఖీ పౌర్ణమి మండుతున్న రాఖీల ధరలు | Rakhi prices Increase in New Delhi | Sakshi
Sakshi News home page

నేడు రాఖీ పౌర్ణమి మండుతున్న రాఖీల ధరలు

Aug 9 2014 10:23 PM | Updated on Jul 6 2019 3:22 PM

రాజధానిలో కాయగూరల ధరలేకాక రాఖీల ధరలూ మండుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే రాఖీల ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయని దుకాణదారులు అంటున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో కాయగూరల ధరలేకాక రాఖీల ధరలూ మండుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే రాఖీల ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయని దుకాణదారులు అంటున్నారు. గత సంవ త్సరం బ్రేస్‌లెట్ రాఖీ ధర 40 నుంచి రూపాయల నుంచి మొదలుకాగా ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయల కంటే తక్కువ లేదు. పిల్లలు మోజుపడే కార్టూన్ రాఖీల ధరలు కూడా బాగా పెరిగాయి.  నిరుడు ఐదు నుంచి ఎనిమిది రూపాయలకు టామ్ అండ్ జెర్రీ,  డోరెమాన్ రాఖీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు వాటి వెల రూ. 10 నుంచి 30 రూపాయలు ఉంది. మామూలు దారంపోగులతో తయారు చేసిన రాఖీల ధర కూడా పెరిగింది. వాటి ధర కూడా 15 రూపాయలు పలుకుతోంది. రాఖీలపై నరేంద్ర మోడీ ప్రభావం సైతం కనబడుతోంది. ప్రధాని చిత్రంతో రూపొందించిన రాఖీలు పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. వాటి ధర రూ.20 నుంచి 30 రూపాయలు ఉంది.
 
 టీవీ సీరియల్స్ ప్రభావం కూడా రాఖీ మార్కెట్‌నై పడింది. కామెడీ నైట్స్ విత్ కపిల్ షో యాంకర్ కపిల్ శర్మ తరచుగ వాడే డైలాగ్ ‘బాబా జీకా టుల్లు’ ఆధారంగా రూపొందించిన రాఖీ వెల రూ.300లని దుకాణదారులు అంటున్నా రు. మరో టీవీ సీరియల్ వీరా ఆధారంగా రూ పొందిన రాఖీ వెల 60 రూపాయలు పలుకుతోంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని నగరంలోని విభిన్న ప్రభుత్వం విభాగాలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సోదరీమణులు పంపే రాఖీలు సోదరులకు సకాలంలో చేర్చడానికి తపాలా విభాగం నగరంలోని 34 ముఖ్యమైన పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. గత 20 రోజులుగా ఈ కౌంటర్లు పనిచేస్తున్నాయి. రాఖీపౌర్ణిమ నాడు అంటే.. ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళలకు డీటీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల భద్రత కోసం పలు ప్రాంతాలలో అధిక బలగాలను మోహరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement