ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బడ్జెట్లో ప్రజలకు అవసరమైన ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించలేదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ విమర్శించారు.
ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ విమర్శలు
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ బడ్జెట్లో ప్రజలకు అవసరమైన ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించలేదని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ విమర్శించారు. ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని, తద్వారా రాష్ట్ర ప్రజలకు కేవలం ‘ప్రకటనల భాగ్య’ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిందని ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విధానసభలో మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ....
రాష్ట్రంలోని ప్రజలందరికి సమాన న్యాయం అందజేయడమే తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏ వర్గం వారికి సంక్షేమ పథకాలను ప్రకటించకుండా సమాన న్యాయం పాటించారని వ్యంగ్య మాడారు. వెనక బడిన వర్గాలకు చెందిన ప్రజలకు విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచే విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తోందని విమర్శించారు. గత ఏడాది బడ్జెట్లో వ్యవసాయానికి చేసిన కేటాయింపుల కంటే ఈ ఏడాది కేటాయింపులను మరిం తగా తగ్గించి రైతులను సైతం నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.