పొలిటి‘కలరింగ్’ | MNS hordes vandalise Bandra-Worli Sea Link, 16 arrested | Sakshi
Sakshi News home page

పొలిటి‘కలరింగ్’

Jan 28 2014 10:54 PM | Updated on Aug 28 2018 4:00 PM

‘గత అనేక సంవత్సరాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకొని రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ ఆకస్మాత్తుగా ఈ టోల్ ఏంటి బాబో అని మొత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది.

సాక్షి, ముంబై: ‘గత అనేక సంవత్సరాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకొని రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ ఆకస్మాత్తుగా ఈ టోల్ ఏంటి బాబో అని మొత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ స్టంట్‌లు రాజ్‌ఠాక్రే ప్రారంభించార’ని  స్వాభిమాన్ సంఘటన అధ్యక్షుడు నీలేష్ రాణే ఆరోపించారు.

 ఇన్నాళ్లు గప్‌చుప్‌గా ఉన్న రాజ్‌ఠాక్రే ఒక్కసారి పూనకమొచ్చినట్టు మాట్లాడి ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి టోల్‌ప్లాజాలపై దాడులకు దిగేట్లు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. కేవలం 12 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ఇలా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అంశాన్ని విధాన సభలో లేవనె త్తడానికి కూడా అవకాశముండేదని, అయితే ఓటర్లను ఆకట్టుకోవడానికి  ఇంత నాటకం ఆడాల్సిన అవసరమేమొచ్చిందని నీలేశ్ రాణే ప్రశ్నించారు.  

 లోక్‌సత్తా డాట్‌కామ్‌కు పోస్టుల వెల్లువ...
 మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలపై దాడులకు దిగారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ కొందరు, తగిన శాస్తి చేశారని మెచ్చుకుంటూ మరికొందరు వెబ్‌సైట్లలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాడుల ఘటన తర్వాత లోక్‌సత్తా డాట్ కామ్‌లో మరాఠీలో అనేక మంది తమతమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజ్ ఇలా దూకుడుగా వ్యవహరించడం ఎన్నికల స్టంట్ అని కొంతమంది వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

 మరికొందరు వాహనదారుల నుంచి అడ్డూ అదుపులేకుండా డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాల ఆగడాలకు కళ్లెం వేయాలంటే ఇలాంటి రాజకీయ పార్టీలు అవసరమని, అందుకు ధన్యవాదాలంటూ మరికొంత మంది పోస్ట్ చేశారు. రోడ్ల నిర్వహణకు అయ్యే ఖర్చులు రాజ్‌ఠాక్రే సొంతంగా భరించి రాష్ట్ర ప్రజలకు టోల్ నుంచి విముక్తి కల్పించాలని, ముంబైలోని సేనా భవన్ ఎదురుగా నిర్మిస్తున్న టవర్‌ను ప్రజలకు ఉచితంగా వాడుకునేందుకు ఇవ్వాలని మరికొందరు రాశారు.  ఎమ్మెన్నెస్ ఇలాంటి చిల్లర వేషాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘అవినీతిలో కూరుకుపోయిన అధికార డీఎఫ్ కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో టోల్‌ప్లాజాలను మూసివేయదు.

 ఈ ప్రభుత్వాలకు బుద్దిచెప్పాలంటే ఎమ్మెన్నెస్ లాంటి దూకుడు పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంద’ని హేమంత్ అభిప్రాయపడ్డారు. ‘ఒక విధంగా ఇది మంచికే జరిగింది. టోల్ పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేస్తున్న కాంట్రాక్టర్లు ఈ మొత్తాన్ని దేనికి వినియోగిస్తున్నారో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చట్టం కేవలం కాంగ్రెస్ సొత్తు కాదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదా..?’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement