ఇన్నాళ్లు ఓటు హక్కుకు కూడా నోచుకొని హిజ్రాలు ఈసారి దాదాపు 500 మంది ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు చేయనున్నారు.
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న హిజ్రాలు
Aug 25 2013 10:51 PM | Updated on Sep 1 2017 10:07 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు ఓటు హక్కుకు కూడా నోచుకొని హిజ్రాలు ఈసారి దాదాపు 500 మంది ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటు చేయనున్నారు. హిజ్రాల పట్ల సమాజం చూపుతున్న వివక్ష రాజకీయపరంగా ముగియనుంది. వీరిని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఓటర్ల జాబితాలో లింగం గురించి తెలిపే కాలంలో స్త్రీ, పురుషులు అని రెండు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా అదర్స్ అనే మూడో వర్గీకరణ కింద హిజ్రాలను ఓటర్లుగా నమోదు చేయనున్నారు.
వీరిని ఓటర్లుగా నమోదు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. 2012 మున్సిపల్ ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్లో అదర్స్ అనే కాలం చేర్చినప్పటికీ హిజ్రాలను ప్రత్యేక వర్గీకృత శ్రేణి కింద ఓటర్లుగా నమోదు చేయలేదు. వచ్చే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పలుచోట్ల శిబిరాలు నిర్వహించి వీరి పేర్లను నమోదు చేస్తోంది.
ఆగస్టు 21నాటి వరకు ఓటర్ల జాబితాలో 519 మంది హిజ్రాల పేర్లు నమోదయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. తుది జాబితా ఖరారు చేసేనాటికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఢిల్లీ ఎన్నికల కార్యాలయం ఆశిస్తోంది. వికాస్పురి, బవానా, మతియాలాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. న్యూఢిల్లీ, మాలవీయనగర్, షాకూర్బస్తీ, కస్తూర్బానగర్లలో ఒక్కరు కూడా లేరని ఎన్నికల సంఘం కార్యాలయం సమాచారం తెలుపుతోంది.
సుల్తాన్పుర్మజ్రా, బవానాలలో 22 మంది, మతియాలాలో 23 మంది, వికాస్పురిలో 20మంది, కిరారీ, నాంగ్లోయ్జాట్లలో 16 మంది ,లక్ష్మీ నగర్లో 15 మంది, పాలం, కోండ్లీలలో 15 మంది, విశ్వాసనగర్, కల్కాజీ, ఆదర్శనగర్లలో 12 మంది, నరేలాలో 1 చొప్పున ఉన్నారని నమోదయింది. ఢిల్లీలో మొత్తం 1,14,99,758 ఓటర్లుండగా అందులో 63,71,809 మంది పురుషులు, 51,27,430 మంది మహిళ ఓటర్లని తేలింది.
Advertisement
Advertisement