వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..? | elections in singareni | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?

Sep 6 2016 11:25 AM | Updated on Sep 2 2018 4:16 PM

వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..? - Sakshi

వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

 మొదలైన ‘గుర్తింపు’ ఎన్నికల ప్రక్రియ
 ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అంటున్న అధికారులు
 డిపెండెంట్ల ఆశలపై నీలినీడలు
 
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారసత్వ ఉద్యోగా ల ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మిగతా కార్మిక సంఘాల పరిస్థితి ఎలా ఉన్నా.. 2012లో జరిగిన 5వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామనే ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నా రు. టీబీజీకేఎస్ తన గుర్తింపు కాలపరిమితి నాలుగేళ్లలో ఆ హామీని నెరవేర్చలేకపోయింది. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం.. ఇదిగో .. అదిగో వస్తున్నాయంటూ నాయకు లు నమ్మబలికారు. ముఖ్యమంత్రిని కలిశామని, ఆయన ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని గనులపైకి వచ్చిన ప్రతీసారి చెప్పారు. ఆచరణలో మాత్రం పెట్టలేక పోయూరు. నాలుగు జిల్లాల కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం సాధారణ ఎన్నికల్లో ఇదే హామీని వళ్లించారుు. చివరకు పుణ్యకాలం పూర్తరుుంది. తిరిగి ఆరవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ ఆదే హామీతో ముందుకు వస్తోంది. ఈ ప్రభావం టీబీజీకేఎస్ పై తీవ్రంగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
 ప్రతికూల పరిస్థితుల్లో..
ఒకప్పుడు బొగ్గుగనుల్లో విధులు నిర్వర్తించి రావడానికి కాలినడకే దిక్కు. భూగర్భంలో కిలోమీటర్ల కొద్ది నడక కారణంగా 50 సంవత్సరాల వయసు పైబడిన కార్మికుల లో ఎక్కువ శాతం మంది మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడేవారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి మద్యానికి బానిసయ్యేవారు. ఈ నేపథ్యంలో కార్మికులు విధులకు ఎక్కువగా గైర్హాజరయ్యేవారు. ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడేది. ఆలోచించిన యాజమాన్యం ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యంతో పనిచేయ ని కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగావకాశం  కల్పించాలని నిర్ణయించింది. 1981 జూన్ 21వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 1998 జూన్ 6 వరకు వారసత్వ ఉద్యోగాలను కొనసాగించారు. తర్వాత కాలంలో సింగరేణిలో యాంత్రీకరణ వేగవంతం కావడంతో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ ఎక్కువగా యంత్రాల తోనే చేపడుతున్నారు. దీంతో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం నిలిపివేసింది. కేవలం మరణించిన, పూర్తిగా పనిచేయలేక అనారోగ్యంతో ఉన్న, గనుల్లో ప్రమాదాలకు గురైన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా నెలకు 25 ఉద్యోగాల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement