
బావిలో పడిన కారు
సాక్షి, భువనేశ్వర్: రాష్ట్రంలో మంగళవారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. సుందర్గడ్ జిల్లాలో ప్రమాదవశాత్తూ ఒక కారు బావిలోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో ఓ యువకుడు దీపక్(26) తుది శ్వాస విడిచాడు. లఠికోట పోలీసు స్టేషను పరిధి కులాముర్డా గ్రామంలో ఈ విషాద సంఘటన సంభవించింది.
గ్రామంలో నిర్వహిస్తున్న అష్ట ప్రహరి యజ్ఞం సందర్శించేందుకు విచ్చేసి అనంత లోకాలకు వెళ్లడం విచారకరం. రాత్రి అంతా కారులో కునుకు తీసి ఉదయం 7 గంటల ప్రాంతంలో మేలుకొన్నాడు. సర్దుకునేంతలో కారు అకస్మాత్తుగా స్టార్టు అయి నుయ్యి వైపు దూసుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
గ్రామస్తులు హుటాహుటీన నూతిలోకి దిగి బాధితుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. నూతిలో పడిన యువకుడిని గ్రామస్తులు బయటకు తీసి అంబులెన్సులో రుర్కెలా ఉక్కు కార్ఖానా జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకుడు మరణించినట్టు వైద్యులు ప్రకటించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.