కుటుంబ గొడవల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మడివాళ పోలీసుల సమాచారం మేరకు... బెంగళూరు శివారులోని కనకపుర తాలూకా మరళవాడికి
బెంగళూరు : కుటుంబ గొడవల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మడివాళ పోలీసుల సమాచారం మేరకు... బెంగళూరు శివారులోని కనకపుర తాలూకా మరళవాడికి చెందిన మైక్సెట్ శివన్న కుమార్తె లత(26)కు మల్లేష్ అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. కుటుంబ గొడవలతో లతను వదిలి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత లత బెంగళూరు చేరుకుని ఫోరం మాల్లో పనికి కుదిరింది.
ఆ సమయంలో పరిచయమైన క్యాబ్ డ్రైవర్ ప్రకాష్ను ఆమె తిరిగి పెళ్లి చేసుకుని గారేబావి పాళ్యలో కాపురం పెట్టింది. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు నచ్చలేదు. రెండేళ్ల కిత్రం లత మేనమామ గణేష్ భార్య పుష్ప భర్తను వదిలి బెంగళూరు చేరుకుని గారేబావిపాళ్యలో ఉన్న గార్మెంట్స్ పరిశ్రమలో పనికి కుదిరింది. ఆమెకు లత ఆశ్రయమిచ్చింది.
ఇటీవల బాబు అనే వ్యక్తిని పుష్ప రెండవ వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న గణేష్, లతపై కక్ష పెంచుకున్నాడు. ఆమె ప్రోత్సహంతోనే పుష్ప మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని భావించాడు. మంగళవారం రాత్రి లత ఇంటికి గణేష్ చేరుకుని ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఆమె మొబైల్ తీసుకుని ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు.
రాత్రికి లత భర్త ప్రకాష్ ఇంటికి చేరుకున్నాడు. బయట తాళం వేసి ఉండడంతో ఫోన్ చేశాడు. రిసీవ్ చేయకపోవడంతో కిటికిలో నుంచి లోపలకు చూశాడు. లత శవమై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. గణేష్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.