తమ్ముడు, మరదలి దారుణ హత్య | Brutal murder as Brother, Sister in law | Sakshi
Sakshi News home page

తమ్ముడు, మరదలి దారుణ హత్య

Apr 26 2016 2:43 AM | Updated on Sep 3 2017 10:43 PM

ఆస్తి తగాదాల్లో సొంత తమ్ముడిని, అతని భార్యను దారుణంగా హత్యకు పాల్పడిన సంఘటన గంగవరం మండలంలో...

* కుమారుడి పరిస్థితి విషమం
* ఆస్తి తగాదాలే కారణం
* విద్యుత్తు ఆపి, కాపు కాసి.. దాడి
* పోలీసుల అదుపులో అన్న

గంగవరం: ఆస్తి తగాదాల్లో సొంత తమ్ముడిని, అతని భార్యను దారుణంగా హత్యకు పాల్పడిన సంఘటన గంగవరం మండలంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన ఆనంద్(36), శివకుమార్ (34) అన్నదమ్ములు.

ఆనంద్ పలమనేరు కొత్తపేటలోను, శివకుమార్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. పలుమార్లు గొడవ పడి పోలీసుస్టేషనకు వెళ్లారు. అదేవిధంగా 15 రోజుల క్రితం మామిడి తోపు అమ్మే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఎలాగైనా శివకుమార్ కుటుంబాన్ని అంతమొందించాలని ఆనంద్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మూడు రోజులుగా గాంధీనగర్‌లో ఉన్న తన ఇంట్లో మకాం పెట్టాడు. ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఆపి విద్యుత్ సరఫరా ఆపేశాడు. వేసవి కావడంతో శివకుమార్, అతని భార్య నాగరత్నమ్మ(26), కుమారుడు యుగంధర్(8), యతీష్ (5) ఇంటి ముందు నిద్రించారు.

ఆనంద్ ముందుగా ఘాడ నిద్రలో ఉన్న నాగరత్నమ్మను కత్తితో నరికేశాడు. తరువాత తమ్ముడు శివకుమార్‌ను నరికాడు. అతని కేకలు విన్న బాలుడు యుగంధర్ నిద్ర నుంచి మేల్కొని గట్టిగా అరిచాడు. దీంతో ఆనంద్ బాలుడిపైనా కత్తితో దాడి చేశాడు. బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. వీరి అరుపులు విన్న గ్రామస్తులు నిద్ర నుంచి మేల్కొని అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు పరిశీలించగా శివకుమార్, నాగరత్నమ్మ మృతిచెందినట్లు గుర్తించారు.

రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడు యుగంధర్‌ను వెంటనే పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. నిందితిడు పోలీసులకు లొంగిపోయాడు. గ్రామస్తులు రాకపోయి ఉంటే శివకుమార్ చిన్న కుమారుడు యతీష్‌పైనా దాడి చేసేవాడు.  సీఐ రవికుమార్, ఎస్‌ఐ దిలీప్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement