ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ

Published Sun, Oct 9 2016 8:56 AM

big theft in excise constable house at ongole

 రూ.4 లక్షల నగదు మాయం  
► 13 సవర్ల బంగారం కూడా..
 
ఒంగోలు : నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధి సుందర్‌ నగర్‌లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డీఎంసీ రంగన్న ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లోని హాల్లో నిద్రిస్తుండగా ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగ బీరువాలోని రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లాడు. రంగన్న దంపతులు ముందు హాలులో నిద్రిస్తున్నారు. బాత్‌ రూమ్‌కు వెళ్లినప్పుడు వెనుక తలుపులు వేయటం మరిచిపోయారో ఏమోగానీ వెనుక నుంచి సులభంగా లోనికి ప్రవేశించిన దుండగుడు బెడ్‌రూమ్‌లోని దిండు కింద ఉన్న తాళాలు తీసుకొని బీరువా తెరిచాడు.

బీరువాలోని బ్యాగులో కుటుంబ అవసరాలకు తెచ్చి పెట్టుకున్న నగదును అపహరించుకెళ్లాడు. నగదుతో పాటు బీరువాలోనే ఉన్న 13 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.25 వేల విలువైన వెండి వస్తువులు కూడా పట్టుకెళ్లాడు. తెల్లవారి లేచి చూసుకునే సరికి వెనుక తలుపులు తీసి ఉన్నాయి.  బీరువా కూడా తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గుర్తించి ఆ సమాచారాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఇచ్చారు. దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు అతను తెచ్చుకున్న తాళాలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఎస్సైలు నాగేశ్వరరావు, సురేష్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్‌ టీం సంఘటన స్థలానికి చేరుకొని బీరువాపై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement