Sakshi News home page

వేధింపులకు వివాహిత బలి

Published Mon, Sep 22 2014 3:20 AM

Abused married in Bali

మండ్య :  భర్త, అత్త, అడపడుచు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి పట్టణంలోని గాంధీనగర్‌లోని 5వ క్రాస్‌లో చోటు చేసుకుంది. పోలీసు కథనం మేరకు.. మండ్యలోని బీడీ కార్మికుల కాలనీకి చెందిన షఫీవుల్లా, జాకీర్‌బాను దంపతుల కుమార్తె కౌసర్‌బాను (20)కు ఇదే పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన  నాసీమ్ పాషాతో ఏడాది క్రితం వివాహమైంది.

ఆ సమయంలో  అత్తింటివారు రూ. 10 వేల నగదు,  బంగారంయ కట్నంగా సమర్పించారు. అయితే అదనపు కట్నం తేవాలని కొంతకాలంగా నాసీమ్‌పాషా, అతని తల్లి అబీబున్నిసా, ఆడపడుచు సీమా కౌసర్‌బానును వేధించేవారు. విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.  చేతిలో డబ్బు లేదని, కొన్ని రోజుల తర్వాత అడిగినంత ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కౌసర్‌బాను తన భర్త, అత్త, ఆడపడచుకు తెలిపింది. అయినా వేధింపులు ఆగలేదు.
 
దీంతో జీవితంపై విరక్తి చెందిన కౌసర్‌బాను శనివారం రాత్రి ఇంటిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన భర్త ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
భర్తను వీడి పుట్టింటిలో ఉంటున్న నాసీమ్ పాషా చెల్లెలు సీమను కాపురానికి పంపేందుకు అవసరమైన డబ్బు కోసం తన కుమార్తెను అల్లుడు, ఆమె తల్లి, ఆడపడచూ వేధింపులకు పాల్పడ్డారని, వాటిని తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు కౌసర్‌బాను భర్త, అతని తల్లి, ఆడపడచను అరెస్ట్ చేశారు.  కౌసర్‌బాను మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.  
 

Advertisement
Advertisement