హంపి శుభారంభం

World Womens Chess Championship - Sakshi

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి విజయంతో శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో సరిపెట్టుకుంది. హయత్‌ తుబాల్‌ (అల్జీరియా)తో జరిగిన తొలి రౌండ్‌ తొలి గేమ్‌లో హంపి 46 ఎత్తుల్లో గెలిచింది. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.

జన్‌సాయా అబ్దుమలిక్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన తొలి గేమ్‌ను భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... నటాలియా పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి గేమ్‌లో భక్తి కులకర్ణి 63 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆదివారం ఈ జోడీల మధ్యే రెండో గేమ్‌ జరుగుతుంది. హంపి తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. హారిక, పద్మిని రౌత్‌లు మాత్రం ముందంజ వేయాలంటే... టోర్నీలో నిలబడాలంటే భక్తి కులకర్ణి రెండో గేమ్‌లో తప్పకుండా గెలవాలి. ఒకవేళ హారిక, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంటే మాత్రం సోమవారం టైబ్రేక్‌ గేమ్‌లను నిర్వహిస్తారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top