breaking news
World chess tournament
-
దివ్యమైన విజయం
అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి దివ్య దేశ్ముఖ్ రూపంలో తొలిసారి చాంపియన్ ఆవిర్భవించింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణులు బరిలో ఉండటం... ఫేవరెట్ ముద్ర లేకపోవడం... 19 ఏళ్ల ఈ మహారాష్ట్ర అమ్మాయికి కలిసొచ్చింది. ఫలితంగా... ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ... అందరి అంచనాలను తారుమారు చేస్తూ... మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే... పక్కా ప్రణాళికతో చకచకా ఎత్తులు వేస్తే... ప్రత్యర్థి ఎంతటి మేధావి అయినా... ఒకానొక దశలో ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేస్తారని.... చివరకు చేతులెత్తేస్తారని... దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో నిరూపించింది. వెరసి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే గెలుపుతో... దివ్య స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడంతోపాటు...మరోవైపు ఊహ కందని విధంగా గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను కూడా ఖాయం చేసుకోవడం విశేషం. బతూమి (జార్జియా): అనుభవంపై యువతరం గెలిచింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ విజేతగా అవతరించింది. రెండు సార్లు ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్ముఖ్ ఓవరాల్గా 2.5–1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం క్లాసికల్ ఫార్మాట్లో నిరీ్ణత రెండు గేమ్లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. ర్యాపిడ్ ఫార్మాట్లో 15 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు జరిగాయి. తొలి గేమ్లో తెల్ల పావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో టైబ్రేక్లో తొలి గేమ్ ముగిశాక ఇద్దరూ 0.5–0.5తో సమంగా నిలిచారు. రెండో గేమ్ను హంపి తెల్ల పావులతో ప్రారంభించింది. ఒకానొక దశలో ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసేలా అనిపించింది. చాంపియన్ను నిర్ధారించేందుకు మరో రెండు ర్యాపిడ్ గేమ్లు అవసరం పడతాయనిపించింది. అయితే సమయాభావం వల్ల కీలక దశలో హంపి ఒత్తిడికిలోనై పొరపాట్లు చేయడం... వాటిని దివ్య సది్వనియోగం చేసుకుంది. ఫలితంగా రెండో గేమ్లో దివ్య 75 ఎత్తుల్లో గెలుపొంది 1.5–0.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. టైబ్రేక్లో తొలి రెండు ర్యాపిడ్ గేముల్లోనే విజేత తేలిపోవడంతో తదుపరి గేమ్లు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఈ గెలుపుతో ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) టైటిల్తో ఉన్న దివ్యకు గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ ఖాయమైంది. విజేత దివ్య దేశ్ముఖ్కు స్వర్ణ పతకంతోపాటు 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 38 వేలు)... రన్నరప్ హంపికి రజత పతకంతోపాటు 35 వేల డాలర్లు (రూ. 30 లక్షల 36 వేలు)... మూడో స్థానం పొందిన చైనా గ్రాండ్మాస్టర్ టాన్ జోంగికి కాంస్య పతకంతోపాటు 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. గాలివాటమేమీ కాదు... 46 దేశాల నుంచి మొత్తం 107 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ ప్రపంచకప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్న దివ్య 15వ సీడింగ్తో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ నాగ్పూర్ అమ్మాయి టైటిల్ గెలిచే క్రమంలో తన కంటే ఎంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు, గ్రాండ్మాస్టర్ హోదా ఉన్న నలుగురు ప్లేయర్లను ఓడించి ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపించుకుంది. ఫైనల్లో హంపి (2543 రేటింగ్ పాయింట్లు), సెమీఫైనల్లో టాన్ జోంగి (చైనా; 2546), క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్; 2483), ప్రిక్వార్టర్ ఫైనల్లో జు జినెర్ (చైనా; 2547 రేటింగ్)లపై దివ్య గెలిచింది. దివ్య 2005లో జన్మించగా... హంపి 2002లోనే గ్రాండ్మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి రెండుసార్లు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ (2019లో, 2024లో) నిలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో హంపినే ఫేవరెట్ అనుకున్నారంతా... కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయంతో ‘దివ్య’మైన చెస్ ప్రపంచాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన వెంటనే దివ్య తన భావోద్వేగాన్ని తల్లితో పంచుకుంది. డాక్టర్ల ఫ్యామిలీ నుంచి... దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్లిద్దరూ డాక్టర్లు. 2005 డిసెంబర్ 5న నాగ్పూర్లో జన్మించిన దివ్య ఐదేళ్ల ప్రాయంలో చెస్లో అడుగు పెట్టింది. దివ్య సోదరి బ్యాడ్మింటన్ శిక్షణకు వెళుతున్న సమయంలో అక్కడే జరుగుతున్న చెస్ శిబిరంలో దివ్య చేరింది. ఆ తర్వాత చెస్పై మక్కువ ఏర్పడటంతో ఆటను సీరియస్గా తీసుకుంది. 2020లో ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ చాంపియన్గా నిలిచింది. 2022 చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత కాంస్య పతకం... 2023లో ఆసియా చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. 2023లోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక, హంపి, సవితాశ్రీ, వంతిక అగర్వాల్, ఇరీనా క్రష్లను ఓడించిన దివ్య వరల్డ్ చాంపియన్ జు వెన్జున్తో, అనా ఉషెనినాతో గేమ్లు ‘డ్రా’ చేసుకొని టోర్నీ విజేతగా నిలిచింది. 2024లో గాంధీ నగర్లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో టైటిల్ నెగ్గిన దివ్య... హంగేరిలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది.ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అయిన హంపి ఓటమి ఊహించలేనిది. ఎండ్గేమ్లో ఆమె వరుసగా తప్పులు చేసింది. 54వ ఎత్తులో చిన్న పొరపాటు చేసి హంపి వెనుకబడినా... ఆమెకు కోలుకునే అవకాశం కూడా వచి్చంది. అయితే సమయాభావ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపించింది. 67వ ఎత్తు వేసే సమయానికి దివ్యకు సానుకూల పరిస్థితి ఏమీ లేదు. దీనిని హంపి జాగ్రత్తగా వేసి ఉంటే గేమ్ డ్రా వైపు వెళ్లేది. కానీ ఇక్కడే హంపి మళ్లీ మరో పెద్ద తప్పు చేసింది. కొత్త తరానికి ప్రతినిధి అయిన దివ్య కొత్తగా నేర్చుకోవడంలో, దూసుకుపోవడంలో సహజంగానే కాస్త ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన హంపిని ఎదుర్కొనేందుకు దివ్య పక్కాగా కొత్త ప్రణాళికలతో సిద్ధమై వచ్చినట్లు కనిపించింది. –చంద్రమౌళి, ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ -
కోనేరు హంపితో ప్రియాంక పోటీ! ముగిసిన హర్ష భరతకోటి కథ..
బకూ (అజర్బైజాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో రెండో రౌండ్కు చేరుకుంది. మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్లో ప్రియాంక ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్లో 1.5–0.5తో గెలుపొందింది. టైబ్రేక్ తొలి గేమ్ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ప్రియాంక, రెండో గేమ్లో 45 ఎత్తుల్లో మరీనాను ఓడించి ఓవరాల్గా 2.5–1.5తో విజయం అందుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వీరి ద్దరి మధ్య జరిగిన తొలి రెండు గేమ్లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ గేమ్లను నిర్వహించారు. రెండో రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్కే చెందిన కోనేరు హంపితో ప్రియాంక తలపడుతుంది. ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ హర్ష భరతకోటి కథ తొలి రౌండ్లోనే ముగిసింది. లెవాన్ పాంట్సులెయ (జార్జియా)తో టైబ్రేక్ తొలి గేమ్లో హర్ష 75 ఎత్తుల్లో ఓడిపోయి, రెండో గేమ్ను 66 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 0.5–1.5తో ఓటమి చవిచూశాడు. -
చెస్ ఒలింపియాడ్లో భారత్కు షాక్
చెన్నై: ఆన్లైన్ వరల్డ్ చెస్ ఒలింపియాడ్లో గత ఏడాది సంయుక్త విజేత భారత జట్టుకు చుక్కెదురైంది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 1.5–4.5తో పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించినా ఆమె సహచరులు తడబడటంతో భారత్కు ఓటమి తప్పలేదు. ముందుగా తొలి రౌండ్ మ్యాచ్లో టీమిండియా 5–1తో అమెరికాను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హారిక 68 ఎత్తుల్లో అనా జటోన్స్కీపై, విశ్వనాథన్ ఆనంద్ 57 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్పై, పెంటేల హరికృష్ణ 53 ఎత్తుల్లో దరియజ్పై, వైశాలి 38 ఎత్తుల్లో థలియా లాండిరోపై గెలుపొందారు. కోనేరు హంపి 29 ఎత్తుల్లో ఇరీనా క్రష్తో, నిహాల్ సరీన్ 70 ఎత్తుల్లో లియాంగ్ అవండర్లతో గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్లో భారత్ 2–4తో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. హారిక 51 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై నెగ్గగా... హంపి 32 ఎత్తుల్లో ఇరీనా క్రష్తో, వైశాలి 60 ఎత్తుల్లో థలియా లాండిరోతో గేమ్లను ‘డ్రా’గా ముగించారు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో లియాంగ్ చేతిలో, విదిత్ 46 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో, ఆనంద్ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో హారిక 34 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై గెలుపొందగా... నిహాల్ 44 ఎత్తుల్లో లియాంగ్తో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. వైశాలి 31 ఎత్తుల్లో థలియా చేతిలో, హరికృష్ణ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో, హంపి 49 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో, ఆధిబన్ 33 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో ఓటమి చవిచూశారు. మరో సెమీఫైనల్లో రష్యా 2–0తో చైనాను ఓడించి నేడు జరిగే ఫైనల్లో అమెరికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. -
హంపి శుభారంభం
ఖాంటీ మన్సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి విజయంతో శుభారంభం చేయగా... ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో సరిపెట్టుకుంది. హయత్ తుబాల్ (అల్జీరియా)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్లో హంపి 46 ఎత్తుల్లో గెలిచింది. సోపికో ఖుఖాష్విలి (జార్జియా)తో జరిగిన తొలి గేమ్ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. జన్సాయా అబ్దుమలిక్ (కజకిస్తాన్)తో జరిగిన తొలి గేమ్ను భారత్కే చెందిన పద్మిని రౌత్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... నటాలియా పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి గేమ్లో భక్తి కులకర్ణి 63 ఎత్తుల్లో ఓడిపోయింది. ఆదివారం ఈ జోడీల మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. హంపి తన గేమ్ను ‘డ్రా’ చేసుకుంటే తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. హారిక, పద్మిని రౌత్లు మాత్రం ముందంజ వేయాలంటే... టోర్నీలో నిలబడాలంటే భక్తి కులకర్ణి రెండో గేమ్లో తప్పకుండా గెలవాలి. ఒకవేళ హారిక, పద్మిని తమ గేమ్లను ‘డ్రా’ చేసుకుంటే మాత్రం సోమవారం టైబ్రేక్ గేమ్లను నిర్వహిస్తారు. -
రన్నరప్ ప్రజ్ఞానంద
ప్రపంచ చెస్ చరిత్రలో పిన్న వయస్సులో గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా పొందిన రెండో ప్లేయర్గా... భారత్ తరఫున జీఎం అయిన పిన్న వయస్కుడిగా శనివారం కొత్త రికార్డు నెలకొల్పిన భారత కుర్రాడు ప్రజ్ఞానంద గ్రెడైన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ఇటలీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 12 ఏళ్ల ప్రజ్ఞానంద 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ కూడా సంపాదించాడు. ఈ టోర్నీలో అతను ఆరు గేముల్లో గెలిచి, మిగతా మూడు గేమ్లను ‘డ్రా’గా ముగించాడు. -
హరికృష్ణ గేమ్ ‘డ్రా’
బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్లోని తొలి గేమ్ను ‘డ్రా’గా ముగించాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ సేతురామన్తో సోమవారం జరిగిన తొలి గేమ్ను తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 74 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మంగళవారం వీరిద్దరి మధ్యే జరిగే రెండో గేమ్లో గెలిచిన వారు మూడో రౌండ్కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ‘డ్రా’ అయితే, బుధవారం టైబ్రేక్ గేమ్లను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఆరుగురు బరిలోకి దిగగా... సూర్యశేఖర గంగూలీ, లలిత్బాబు, ఆధిబన్, విదిత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. -
రెండో రౌండ్లో హరికృష్ణ
బాకు (అజర్బైజాన్) : ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మాక్స్ ఇల్లింగ్వర్త్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పోటీలో హరికృష్ణ 2-0తో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తొలి గేమ్లో 72 ఎత్తుల్లో నెగ్గిన హరికృష్ణ, శనివారం జరిగిన రెండో గేమ్లో 59 ఎత్తుల్లో గెలిచాడు. ఆంధ్రప్రదేశ్కే చెందిన లలిత్ బాబు తొలి రౌండ్లో 0.5-1.5తో రాడోస్లావ్ వొటాసెక్ (పోలండ్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో భారత్కే చెందిన సేతురామన్తో హరికృష్ణ తలపడతాడు.