
న్యూఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు నుంచి కూడా ఆడబోయే ప్రత్యర్థి గురించి కాకుండా భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఆలోచిస్తూ వచ్చింది. అడిగినా, అడగకపోయినా కెప్టెన్ సహా అందరూ సఫారీ టూర్ ప్రాధాన్యత గురించే చెబుతూ వచ్చారు. దానికి సన్నాహకంగా లంకతో 3 టెస్టుల కోసం పచ్చిక ఉన్న పేస్ పిచ్లను సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే తాజాగా ఢిల్లీ పిచ్పై లంక కెప్టెన్ చండిమాల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ‘తాము దక్షిణాఫ్రికా పర్యటన కోసం సిద్ధమవుతున్నామని భారత్ చెబుతూ వచ్చింది.
కానీ వారు ఇలాంటి పిచ్లు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడి వికెట్ను చూస్తే వారు దక్షిణాఫ్రికా సిరీస్కు సన్నాహకం చేస్తున్నట్లుగా అనిపించడం లేదు. ఇది కూడా నాగ్పూర్ పిచ్లాగే పరుగుల వరద పారేలా ఉంది. కోల్కతా కొంత వరకు ఓకే గానీ ఈ రెండు పిచ్లు మాత్రం అలా అస్సలు లేవు. మాతో ఆడుతూ తర్వాతి పర్యటన గురించి మాట్లాడటం మమ్మల్ని అవమానించినట్లుగా భావించడం లేదు. వాళ్ల ఆలోచనలను మేం నియంత్రించలేం కదా’ అని అన్నాడు.