ఆస్ట్రేలియా పర్యటనలో నాణ్యమైన క్రికెట్ ఆడినా, కీలక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యామని భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో నాణ్యమైన క్రికెట్ ఆడినా, కీలక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యామని భారత యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆసీస్తో వన్డే సిరీస్లో బాగా ఆడినా ఓటమి ఎదురుకావడం బాధాకరమని, అయితే జట్టు ప్రేరణ పొందిందని చెప్పాడు. ఆసీస్తో వరుసగా నాలుగు వన్డేల్లో ధోనీసేన భారీ స్కోర్లు చేసినా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి, ఐదో వన్డే శనివారం జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
తొలి మూడు మ్యాచ్ల్లో కీలక సమయాల్లో భారత బౌలర్లు సరిగా రాణించలేదని విమర్శించాడు. మరింత చురుగ్గా ఉంటూ, మ్యాచ్లను విజయవంతంగా ముగించడం అవసరమని చెప్పాడు. తనను తాను పరీక్షించుకోవడానికి ఆసీస్ పర్యటన ఓ అవకాశమని అన్నాడు. బ్యాటింగ్లో రాణించడానికి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి సాయపడ్డాడని, అయితే కెప్టెన్సీ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోడని చెప్పాడు.