
సౌతాంప్టన్: ప్రపంచ కప్ తొలి మ్యాచ్కు ముందు టీమిండియాకు కొంత ఆందోళన కలిగించే వార్త. శనివారం ఏజెస్ బౌల్లో ప్రాక్టీస్ సందర్భంగా జట్టు కీలక బ్యాట్స్మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి కుడి చేతి బొటన వేలికి బంతి బలంగా తగిలింది. దీంతో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్ వెంటనే కోహ్లి వేలిపై స్ప్రే చేసి, టేప్ చుట్టాడు. తర్వాత అతడు నెట్స్ నుంచి బయటకు వచ్చి వేలును ఐస్ వాటర్లో ఉంచాడు. ఈ పరిణామంపై పెద్దగా ఆందోళన అవసరం లేదని జట్టు యాజమాన్యం పేర్కొంటోంది. మరోవైపు మిడిలార్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ ఫిట్నెస్ సంతరించుకున్నట్లే కనిపిస్తున్నాడు. రెండు సన్నాహ మ్యాచ్లకు దూరమైన అతడు... నెట్స్లో బ్యాటింగ్ చేశాడు. అతడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. టీమిండియా ఆటగాళ్లు ఆదివారం నెట్ ప్రాక్టీస్కు విరామం ఇచ్చారు. జిమ్లో కసరత్తులు చేశారు.