దక్షిణాఫ్రికా జోరుకు శ్రీలంక మళ్లీ తలవంచింది. వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం చవిచూసింది.
మూడో వన్డేలోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా జోరుకు శ్రీలంక మళ్లీ తలవంచింది. వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం చవిచూసింది. దీంతో మరో రెండు వన్డేలు మిగిలుండగానే సఫారీ జట్టు 3–0తో సిరీస్ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 39.2 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డిక్వెలా (80 బంతుల్లో 74; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ 3, రబడా, ఇమ్రాన్ తాహిర్, ఫెలుక్వయో తలా 2 వికెట్లు పడగొట్టారు.
తర్వాత 164 పరుగుల సునాయాస లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 32 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ డివిలియర్స్ (61 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు. ఆమ్లా 34, డుమినీ 28, డు ప్లెసిస్ 24 పరుగులు చేశారు. నాలుగో వన్డే మంగళవారం కేప్టౌన్లో జరుగుతుంది.