పేస్‌... ఆ ఘనత సాధిస్తాడా..! | Tennis giant step away from the world record | Sakshi
Sakshi News home page

పేస్‌... ఆ ఘనత సాధిస్తాడా..!

Feb 3 2017 12:27 AM | Updated on Sep 5 2017 2:44 AM

పేస్‌... ఆ ఘనత సాధిస్తాడా..!

పేస్‌... ఆ ఘనత సాధిస్తాడా..!

భారత టెన్నిస్‌ జట్టు నేటి (శుక్రవారం) నుంచి న్యూజిలాండ్‌తో జరిగే డేవిస్‌కప్‌ (ఆసియా/ఓసియానియా గ్రూప్‌ 1) మ్యాచ్‌ బరిలోకి దిగనుంది.

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో టెన్నిస్‌ దిగ్గజం
పేస్‌కు జోడిగా విష్ణువర్ధన్‌
గాయంతో సాకేత్‌ దూరం
నేటి నుంచి న్యూజిలాండ్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌
 

పుణే: భారత టెన్నిస్‌ జట్టు నేటి (శుక్రవారం) నుంచి న్యూజిలాండ్‌తో జరిగే డేవిస్‌కప్‌ (ఆసియా/ఓసియానియా గ్రూప్‌ 1) మ్యాచ్‌ బరిలోకి దిగనుంది.  దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌కు ఈ పోరు ద్వారా అరుదైన అవకాశం ముంగిట నిలిచింది. సుదీర్ఘకాలంగా టెన్నిస్‌లో కొనసాగుతున్న ఈ అలుపెరగని వీరుడు ప్రపంచ రికార్డుకు మరో అడుగు దూరంలోనే ఉన్నాడు. శనివారం జరిగే డబుల్స్‌లో 43 ఏళ్ల పేస్‌ గెలిస్తే డేవిస్‌ కప్‌లో అత్యధిక డబుల్స్‌ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అతను 42 డబుల్స్‌ విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ)తో సమంగా ఉన్నాడు. 18 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు దక్కించుకున్న పేస్‌కు ఇది 55వ డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఇక ఈ గ్రూప్‌ 1 టైలో గెలిచిన జట్టు ఉజ్బెకిస్తాన్, కొరియా జట్ల మధ్య జరిగే విజేతతో ఏప్రిల్‌ 7 నుంచి 9 వరకు జరిగే రెండో రౌండ్‌లో తలపడుతుంది. మరోవైపు చివరి నిమిషంలో పేస్‌ డబుల్స్‌ జోడిలో మార్పు జరిగింది. గత నెలలో చెన్నై ఓపెన్‌లో గాయపడిన సాకేత్‌ మైనేని ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో హైదరాబాదీ విష్ణువర్ధన్‌కు చోటు లభించింది. విష్ణుతో కలిసి గతంలో పేస్‌ లండన్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు. రెండో రోజు శనివారం వీరిద్దరు అర్టెమ్‌ సిటాక్, మైకేల్‌ వీనస్‌ను ఎదుర్కొంటారు. అయితే రోహన్‌ బోపన్నతో మాట్లాడిన అనంతరం విష్ణు ఎంపిక జరిగిందని డ్రా విడుదల చేసిన అనంతరం నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ ఆనంద్‌ అమృత్‌రాజ్‌ తెలిపారు. ‘అదృష్టవశాత్తు విష్ణు హైదరాబాద్‌లో ఉండడంతో మా పని సులువైంది. కజకిస్తాన్‌లో జరిగే టోర్నీకి వెళ్లేందేకు అతడికి వీసా లభించలేదు’ అని అమృత్‌రాజ్‌ అన్నారు. డేవిస్‌కప్‌ గురించి మొదట పేస్, ఆ తర్వాత జీషన్‌ అలీ నుంచి ఫోన్లు వచ్చాయని విష్ణు చెప్పాడు. ఫ్యూచర్స్, ఐటీఎఫ్‌ ఈవెంట్స్‌ ఉన్నా దేశం కోసం ఆడటం తొలి ప్రాధాన్యతగా భావించి అంగీకరించినట్టు తెలిపాడు.

భారత్‌దే పైచేయి
కివీస్‌ ఆటగాళ్ల ర్యాకింగ్స్‌తో పోలిస్తే భారత ఆటగాళ్లు మెరుగైన స్థితిలో ఉండటంతో మన జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అలాగే సొంత గడ్డపై ఆడనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. కివీస్‌పై భారత్‌ ఇప్పటికే 5–3 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆ మూడు పరాజయాలు కూడా 1970 దశకంలో ఎదురైనవే. 1978 నుంచి భారత్‌ ఇప్పటివరకు ఈ జట్టుపై ఓడింది లేదు. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ సింగిల్స్‌ విభాగంలో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ 368 ర్యాంకర్‌ బాంబ్రీ కివీస్‌ నంబర్‌వన్‌ ఆటగాడు ఫిన్‌ టియర్నీని ఎదుర్కోనున్నాడు. రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌.. జోస్‌ స్టాథమ్‌తో ఆడతాడు. మ్యాచ్‌లు మధ్యాహ్నం ప్రారంభమై రాత్రి ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో కొనసాగుతాయి. ‘వారి డబుల్స్‌ టీమ్‌ పటిష్టంగా ఉంది. అలాగని వారితో సింగిల్స్‌ మ్యాచ్‌లను మేం తేలిగ్గా తీసుకోం. చివరిసారి మేం వారితో ఆడినప్పుడు అలాగే భావించి 1–2తో వెనకబడ్డాం. ఇక పేస్‌ రిటైర్మెంట్‌ అనేది పూర్తిగా అతడి వ్యక్తిగత విషయం. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది తనే’ అని అమృత్‌రాజ్‌ తేల్చారు. 2012లో కివీస్‌ను భారత్‌ 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ మ్యాచ్‌లో పేస్‌ ఆడలేదు.

దేశం కోసం ఆడుతున్నప్పుడు నా సర్వశక్తిని ధారపోస్తాను.  1990లో నా తొలి డేవిస్‌ కప్‌ను ప్రస్తుత కోచ్‌ జీషన్‌ అలీతో కలిసి ఆడాను. అప్పటి నుంచి 27 ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాను. ఎందుకంటే నేను నా దేశ ప్రజల కోసం, దేశం కోసం, జట్టు కోసం ఆడడాన్ని ఆస్వాదిస్తాను. నా వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యం. సాకేత్‌ను దురదృష్టం వెంటాడింది. ఇలాంటి పెద్ద టోర్నీలో గాయం కారణంగా దూరం కావాలని ఏ ఆటగాడూ కోరుకోడు. టోర్నీకి ఒకరోజు ముందే విషయం తెలిసినా విష్ణు ఇందులో ఆడేందుకు అంగీకరించడం గొప్ప విషయం. అతడి అంకితభావానికి ఇది నిదర్శనం.    – లియాండర్‌ పేస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement