టైటాన్స్‌ గెలుపు బాట 

Telugu Titans beat Jaipur Pink Panthers 36-26 - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌కు ఓ గెలుపు.  ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టైటాన్స్‌... సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ 36–26తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు పోరాడటంతో టైటాన్స్‌ 17–13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లోనూ రాణించి గెలుపును అందుకుంది.
 

టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి, నీలేశ్‌ చెరో 8 పాయింట్లు సాధించారు. ట్యాక్లింగ్‌లో అనిల్‌ కుమార్‌ (4 పాయింట్లు) రాణించాడు. పింక్‌ పాంథర్స్‌ తరఫున దీపక్‌ హుడా 10, అజింక్యా పవార్‌ 6, సందీప్‌ ధుల్‌ 5 పాయింట్లు స్కోర్‌ చేశారు. సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగిన తెలుగు ప్లేయర్‌ గంగాధరి మల్లేశ్‌ 3 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 31–20తో బెంగాల్‌ వారియర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్, హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనున్నాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top