భువనేశ్వర్‌ చేరిన జట్లు 

Teams joining Bhubaneswar - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత్, శ్రీలంక జట్లు సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ చేరుకున్నాయి. కటక్‌లోని బరాబటి స్టేడియంలో బుధవారం మ్యాచ్‌ జరుగుతుంది. రెండు జట్లు విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు వచ్చాయి. స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి ఘన స్వాగతం లభించింది. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయం నుంచి బస చేసేందుకు హోటళ్లకు తరలించారు.  మంగళవారం రెండు జట్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు శ్రీలంక... మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారత్‌ సాధన చేస్తాయి.  

టాప్‌–5లో రోహిత్‌ 
దుబాయ్‌: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ద్విశతకంతో చెలరేగిన భారత తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌–5లో చోటు దక్కించుకున్నాడు. తొలిసారిగా 800 ప్లస్‌ పాయింట్ల జాబితాలోకి చేరిన రోహిత్‌ తాజాగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకును అందుకున్నాడు. 2016 ఫిబ్రవరిలో తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకులో ఉన్నాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఒక స్థానం ఎగబాకి 14వ ర్యాంక్‌లో నిలిచాడు. 876 పాయింట్లతో కోహ్లి, 872 పాయింట్లతో డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా) తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top