శ్రీకాంత్‌ సంచలనం

Srikanth sensation

ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ అక్సెల్‌సన్‌పై విజయం

డెన్మార్క్‌ ఓపెన్‌లో సెమీస్‌లోకి ప్రవేశం

క్వార్టర్స్‌లోనే సైనా, ప్రణయ్‌ ఓటమి  

ఒడెన్స్‌: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లోనూ అదరగొడుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 14–21, 22–20, 21–7తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఈ గెలుపుతో ఈ ఏడాది అక్సెల్‌సన్‌ చేతిలో జపాన్‌ ఓపెన్‌లో, ఇండియా ఓపెన్‌లో తనకు ఎదురైన పరాజయాలకు ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (భారత్‌) 13–21, 18–21తో టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు.

గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో శ్రీకాంత్‌ 21–13, 8–21, 21–18తో జియోన్‌ హయోక్‌ జిన్‌ (కొరియా)పై నెగ్గగా... ప్రణయ్‌ 21–17, 11–21, 21–19తో మలేసియా దిగ్గజం, మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీపై సంచలన విజయం సాధించాడు.  మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. సైనా 10–21, 13–21తో కేవలం 29 నిమిషాల్లో అకానె యామగుచి (జపాన్‌) చేతిలో ఓడింది. భారత స్టార్,  ప్రపంచ రెండో ర్యాంకర్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లో 17–21, 21–23తో చెన్‌ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top