భారత్‌ గెలుపు-లంక అభిమానుల సంబరం

Sri Lank Fans Celebrates Indian Victory - Sakshi

కొలంబో : నిదహాస్‌ ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌ ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌ రెండు సార్లు జరగ్గా రెండుసార్లు భారత్‌ విజేతగా నిలిచింది. 1998లో జరిగిన టోర్నీలో శ్రీలంకపై ఆరు పరుగులతో గెలుపొంది తొలిసారి సిరీస్‌ సొంతం చేసుకోగా, ఆదివారం రోజు జరిగిన  ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి కప్‌ను కైవశం చేసుకుంది.

ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌ టీ20 మ్యాచ్‌లోని అసలు మజాను క్రికెట్‌ అభిమానులకు చూపించాడు. కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. దినేష్‌ కార్తీక్‌ అద్భుత ఆటతీరుతో భారత్‌ను గెలిపిండంతో క్రికెట్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే భారత్‌ అభిమానులతో పాటు శ్రీలంక అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు. భారత్‌ విజయాన్ని తమ విజయంగా భావించి వేడుకలు జరుపుకున్నారు.

ఇందుకు కారణం బంగ్లాదేశ్‌, శ్రీలంకల మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంక అనూహ్యంగా ఓటమిపాలైంది. అంతేకాకుండా బంగ్లా ఆటగాళ్లు శ్రుతిమించి శ్రీలంక ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ , బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో లంక అభిమానులు ఇండియాకు మద్దతు పలికారు. భారత్‌ గెలవాలని కోరుకున్నారు. ఉత్కంఠ పోరులో భారత్‌ గెలవడంతో లంక అభిమానులు పండగ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఓ శ్రీలంక అభిమాని, భారత అభిమాని సుధీర్‌ కుమార్‌ చౌదరిని ఎత్తుకొని గ్రౌండ్‌లో పరుగులు తీశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ అయ్యింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top