ఒక్కసారిగా 146 స్థానాలు ఎగబాకాడు..

Saini Jumped 146 Places To 98th In T20 Rankings - Sakshi

దుబాయ్‌:  శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్‌లో మ్యాన్‌ ఆప్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ.. తాజాగా అంతర్జాతీయ క్రికెట​ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లోకి దూసుకొచ్చాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో సైనీ ఐదు వికెట్లు సాధించాడు. తొలి టీ20లో రెండు వికెట్లు సాధించిన సైనీ.. రెండో టీ20లో మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక్కసారిగా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 146 స్థానాలు ఎగబాకి 98వ స్థానానికి చేరుకున్నాడు. ఇక మరొక బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 92వ స్థానంలో నిలిచాడు.ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు సాధించడమే కాకుండా మూడో టీ20లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

ఇక బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ 6వ స్థానాన్ని కాపాడుకున్నాడు. లంకేయులతో సిరీస్‌లో 45, 54 పరుగులతో రాణించిన రాహుల్‌ 26 పాయింట్లను సాధించాడు. దాంతో 760 రేటింగ్‌ పాయింట్లతో ఆరో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక్కడ విరాట్‌ కోహ్లి 683 రేటింగ్‌ పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకాడు. శిఖర్‌ ధావన్‌ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు.ఈ జాబితాలో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌(879 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆసీస్‌ క్రికెటర్‌ అరోన్‌ ఫించ్‌(810 రేటింగ్‌ పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top