సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ నుంచి డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వైదొలిగింది.
లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ నుంచి డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వైదొలిగింది. కాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేని కారణంగా సయ్యద్ మోదీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సైనా తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఈవెంట్ నిర్వహకులకు లేఖ రూపంలో తాను వైదులుగుతున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజుల నుంచి తన కాలి గాయం బాధిస్తుందని, ఇంకా ఆ గాయం పూర్తిగా నయం కాలేనందున టోర్నీకి దూరం అవుతున్నట్లు తెలిపింది. మంగళవారం(జనవరి 26) నుంచి సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి టోర్నమెంట్ ఆరంభం కానున్న నేపథ్యంలో సైనా తన నిర్ణయాన్ని చివరి నిమిషంలో నిర్వాహకులకు తెలియజేసింది.
గతేడాది చైనా ఓపెన్ ఫైనల్స్ లో గాయంతో బాధపడిన సైనా.. ఆ తరువాత జరిగిన హాంకాంగ్ ఓపెన్ కు దూరమయ్యింది. కాగా, డిసెంబర్ లో జరిగిన బీడబ్యూఎఫ్ సూపర్ సిరీస్ కు గాయం పూర్తిగా తగ్గకుండానే సైనా సన్నద్ధమయ్యింది. దీంతో ఆ గాయం మరోసారి తిరగబెట్టడంతో గత కొంతకాలంగా సైనా విశ్రాంతి తీసుకుంటుంది.