ధోని సరసన రోహిత్
బెంగళూరు: అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఫీట్ను సాధించాడు. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 తర్వాత మరో ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిగా ఎంఎస్ ధోనితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇప్పటివరకూ ఎంఎస్ ధోని 98 మ్యాచ్లు ఆడితే, రోహిత్ తన తాజా మ్యాచ్ అనంతరం ఈ మార్కును చేరుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆటగాళ్లలో ధోని, రోహిత్ శర్మల తర్వాత స్థానంలో సురేశ్ రైనా ఉన్నాడు. రైనా ఇప్పటివరకూ 78 మ్యాచ్లు ఆడి మూడో స్థానంలో ఉండగా, కోహ్లి 72 మ్యాచ్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం కోహ్లి, రోహిత్లు అంతర్జాతీయ టీ20 పరుగుల రికార్డులో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రెండో టీ20లో కోహ్లి రాణించడంతో రోహిత్ శర్మ రికార్డును సవరించాడు. కోహ్లి 2,450 పరుగులతో ఉండగా, రోహిత్ 2,443 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక యాభైకి పరుగుల్ని కోహ్లి 22 సార్లు సాధించగా, రోహిత్ 21 సార్లు సాధించాడు. ఇక్కడ కోహ్లి ఖాతాలో సెంచరీలు ఏమీ ఉండకపోగా, రోహిత్ శర్మ ఖాతాలో నాలుగు అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.
సంబంధిత వార్తలు