రోహిత్‌-కోహ్లి సేమ్‌ టు సేమ్‌

Rohit And Kohli Disappoints With 9 Individual Runs  - Sakshi

బెంగళూరు:  అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన టాప్‌ను కాపాడుకున్నాడు.  ఈ జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో రోహిత్‌ శర్మ ఉ‍న్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ప్రారంభానికి ముందు కోహ్లి రికార్డును రోహిత్‌ సవరించి మళ్లీ అగ్రస్థానానికి చేరతాడని అతని ఫాన్స్‌ ఊహించారు. కాకపోతే రోహిత్‌ శర్మ ఆదిలోనే నిరాశ పరిచాడు. బి హెండ్రిక్స్‌  వేసిన మూడో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌(9) పెవిలియన్‌ చేరాడు. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న ఆర్‌ హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లి కూడా విఫలమయ్యాడు.

గత మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపించిన కోహ్లిని రబడా ఔట్‌ చేశాడు. మిడ్‌ వికెట్‌ మీదుగా కోహ్లి భారీ షాట్‌ కొట్టగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఫెహ్లుక్వోయో అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో కోహ్లి ఇన్నింగ్స్‌  ముగిసింది. అయితే ఇక్కడ రోహిత్‌-కోహ్లిలు తమ వ్యక్తిగత స్కోరు 9 పరుగుల వద్ద ఔట్‌ కావడం గమనార్హం. మ్యాచ్‌కు ముందు కోహ్లి వర్సెస్‌ రోహిత్‌లు పోరు అనుకుంటే, ఇద్దరూ సేమ్‌ టు సేమ్‌ ఒకే సంఖ్య వద్ద ఔటయ్యారే అనుకోవడం అభిమానుల వంతైంది.  జట్టు స్కోరు 63 పరుగుల వద్ద శిఖర్‌ ధావన్‌(36) ఔట్‌ కాగా, జట్టు 68 పరుగుల వద్ద కోహ్లి మూడో వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు. మూడో టీ20లో టాస్‌ గెలిచిన  భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top