
‘ధోనికి ఆ సత్తా ఉంది’
ఎంఎస్ ధోని కెప్టెన్సీ వదులుకోవడాన్ని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సమర్థించాడు.
ముంబై: ఎంఎస్ ధోని కెప్టెన్సీ వదులుకోవడాన్ని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సమర్థించాడు. సరైన సమయంలో ధోని కెప్టెన్సీ వదులుకున్నాడని అన్నాడు. ధోని బాధ్యతలు స్వీకరించేందుకు విరాట్ కోహ్లి సిద్ధంగా ఉన్నాడని వెల్లడించాడు. మరికొంత కాలం క్రికెట్ ఆడే సత్తా ధోనికి ఉందని అభిప్రాయపడ్డాడు. జనవరి 15 నుంచి ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ లో మిస్టర్ కూల్’ ఆడతాడని సూచనప్రాయంగా చెప్పాడు.
‘మహి తీసుకున్న నిర్ణయం నాకు కొంచెం బాధ కలిగించింది. ఏడాది లేదా ఆరు నెలలు ముందుగానే అతడు కెప్టెన్సీ వదులుకున్నట్టు అనిపించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నందుకు ధోని సెల్యూట్ చేస్తున్నాను. ధోని కెప్టెన్సీ వదులుకోవడం నూటికి నూరుపాళ్లు సరైన నిర్ణయం. భారత క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతడు ఈ నిర్ణయానికి వచ్చాడు. తన వారసుడు కోహ్లి అని ధోనికి తెలుసు. టెస్టు కెప్టెన్ గా కోహ్లి ఇప్పటికే సత్తా చాటాడు. వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ గా మరి కొన్నేళ్లు జట్టుకు ధోని సేవలు అందించగలడ’ని ప్రసాద్ అన్నాడు.