శ్రీలంక ‘రికార్డు’ స్కోరు | Perera, Mendis power Srilanka to 214 runs | Sakshi
Sakshi News home page

శ్రీలంక ‘రికార్డు’ స్కోరు

Mar 10 2018 9:09 PM | Updated on Nov 9 2018 6:46 PM

Perera, Mendis power Srilanka to 214 runs - Sakshi

కొలంబో:ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంకేయులు ఆది నుంచి దూకుడుగా ఆడారు. శ్రీలంక ఓపెనర్లలో దనుషా గుణతిలకా (26;19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) దాటిగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కుశాల్‌ మెండిస్‌(57;30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్‌ను ఝుళిపించాడు. ఇక ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు కుశాల్‌ పెరీరా (74; 48 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు‌) చెలరేగి ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

ఈ క్రమంలోనే కుశాల్‌ ద్వయం 85 పరుగులు జోడించింది. అయితే ఓ దశలో 8 పరుగుల వ్యవధిలో షనకా(0), చండిమాల్‌(2)లు పెవిలియన్‌ చేరడంతో శ్రీలంక తడబాటకు గురైంది. అటు తర్వాత పెరీరాకు జత కలిసిన ఉపుల్‌ తరంగా సమయోచితంగా ఆడాడు. మరొకవైపు పెరీరా బౌండరీలతో ఎదురుదాడి చేస్తూ లంక బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత పెరీరా ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. ఇక ఉపుల్‌ తరంగా(32 నాటౌట్‌; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 ఫోర్‌) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో లంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఫలితంగా అంతర్జాతీయ టీ 20ల్లో శ్రీలంక నాల్గో అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై అత్యధిక టీ 20 స్కోరును సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ మూడు వికెట్లు సాధించగా, మహ్మదుల్లా రెండు వికెట్లు తీశాడు. తస్కిన్‌ అహ్మద్‌కు వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement