ఎందుకిలా వెల వెల ... | NO public in Olympic stadiums | Sakshi
Sakshi News home page

ఎందుకిలా వెల వెల ...

Aug 12 2016 1:13 AM | Updated on Sep 4 2017 8:52 AM

ఎందుకిలా వెల వెల ...

ఎందుకిలా వెల వెల ...

రండి బాబూ రండి... మా ఆటను చూడండి... ఒక్క పది సెకన్లు మాత్రమే... ఆలసించిన ఆశాభంగము...

 ఖాళీగా కనిపిస్తున్న ఒలింపిక్స్ స్టేడియాలు  
 ఆసక్తి చూపించని స్థానికులు  
 భయాలతో దూరమైన విదేశీయులు

 
 రండి బాబూ రండి... మా ఆటను చూడండి... ఒక్క పది సెకన్లు మాత్రమే... ఆలసించిన ఆశాభంగము... పాత రోజుల్లో ఊర్లోకి సినిమా వచ్చినప్పుడు రిక్షాలో తిరుగుతూ చేసే ప్రకటనలాగా వినిపిస్తోంది కదూ... ఇప్పుడు అచ్చం అలాగే మాట్లాడుతోంది ఎవరో కాదు... ప్రపంచ క్రీడా చరిత్రలో దిగ్గజ ఆటగాడి నోటినుంచే ఈ పలుకులు వచ్చాయి మరి. ఆదివారం జరిగే స్ప్రింట్ పోటీల కోసం టికెట్లు కొనమంటూ ఉసేన్ బోల్ట్ చేస్తున్న విజ్ఞప్తి ఇది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చివరకు బోల్ట్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
 
 ఒలింపిక్స్ అంటే క్రీడల పండగ. నాలుగేళ్లకు ఒక సారి వచ్చే అతి పెద్ద సంబరం. ఇంత మంది ఒకే చోట, ఒకే సారి తమ ఆటను ప్రదర్శించేందుకు, దానిని చూసి తరించేందుకు అభిమానులకు ఇదొక్కటే అవకాశం. ప్రత్యక్షంగా క్రీడలు తిలకించినవారికి ఆ జ్ఞాపకాలు జీవిత కాలం మదిలో పదిలం. కానీ రియోలో పరిస్థితి చూస్తే అంతా తలకిందులుగా కనిపిస్తోంది. చాలా క్రీడాంశాలను అసలు జనం పట్టించుకోకపోవడంతో స్టేడియాలన్నీ బోసిపోతున్నాయి. అనామకులే కాదు అసాధ్యులైన స్టార్లు బరిలో ఉన్న పోటీలకు కూడా స్పందన లేకపోవడం ఆశ్చర్యకరం.
 
 టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఒక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడుతున్నాడంటే జనం ఎంతగా ఎగబడిపోతారు... టికెట్ ధర ఎంత భారీగా ఉన్నా కొనేసి కోర్టులో వాలిపోతారు. చాలా సందర్భాల్లో డబ్బులు ఉన్నా టికెట్ కూడా దొరకదు. కానీ రియో ఒలింపిక్స్‌లో అతను ఆడుతున్న కోర్టులో గుప్పెడంత మంది ప్రేక్షకులు కూడా లేరు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ క్రీడ అయిన టెన్నిస్‌కే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర క్రీడలను జనం ఏ మాత్రం పట్టించుకుంటారు. ఇక అధమ స్థాయిలో వాటర్‌పోలో, రగ్బీ సెవెన్స్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, మహిళల ఫుట్‌బాల్‌లాంటి ఈవెంట్‌లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వీటితో పోలిస్తే బీచ్ వాలీబాల్ పరిస్థితి కాస్త మె రుగ్గా ఉన్నా అందుకు కారణమేమిటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
  నిర్వహణలో లోపాలు
 రియో ఒలింపిక్స్‌లో ప్రేక్షకుల కోసం అన్ని ఆటలు, కేటగిరీలు కలిపి మొత్తం 75 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచారు. అధికారిక లెక్క ప్రకారం 84 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ అదే లెక్క స్టేడియాలలో మాత్రం ప్రతిఫలించడం లేదు. క్రీడలు జరుగుతున్న స్టేడియంలు రియో నగరంలో ఒక్కో మూలన ఉన్నాయి. ఒక చోటికి వెళ్లాలంటేనే కనీసం మూడు సార్లు బస్సు కానీ రైలు కాని ఎక్కి దిగాల్సిన పరిస్థితి. పైగా ఇంత కష్టపడి మైదానానికి వెళితే సెక్యూరిటీ సిబ్బంది అపరిమిత నిబంధలు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. బ్రెజిల్ జిమ్నాస్ట్ ఆర్థర్ జనేటి ఆటను చూద్దామని వెళ్లిన ఒక వీర ఫ్యాన్‌ను విపరీతమైన సెక్యూరిటీ తనిఖీల కారణంగా  చాంతాడులాంటి క్యూ పలకరించింది. దాంతో అతను పోటీలు చూడలేకపోయాడు.

 ‘ఇది దుర్మార్గం, టికెట్ కొన్న ప్రేక్షకుడు అంటే మా అధికారులకు అంత చులకనా, బ్రెజిల్‌వాసిగా సిగ్గు పడుతున్నా’ అని అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీటికి తోడు బ్లాక్ టికెట్ల జోరు కూడా అసలు అభిమానులను ఆటకు దూరం చేస్తోంది. ‘నలుగురు సభ్యుల మా కుటుంబం అధికారిక టికెట్ ధర ప్రకారం లెక్క చూసుకొని ఇక్కడికి వస్తే టికెట్లు లేవన్నారు. పక్కనే బ్లాక్‌లో అమ్మేవాడి రేట్‌లో మేం ఒక్కరం కూడా పోటీలు చూడటం సాధ్యం కాదు’ అంటూ ఒక వ్యక్తి వెనుదిరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. పైగా కొన్ని ఆటల గురించి బ్రెజిల్‌వాసులకు బొత్తిగా పరిచయం లేదు. దాంతో వారు అటు వైపు తిరిగి కూడా చూడటం లేదు. టికెట్ల ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయనేది కొంత మంది స్థానికుల వాదన. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా సీట్లు ఖాళీగా కనిపించడం ఆశ్చర్యకరం.
 
 విదేశీయులు బైబై...
 ప్రపంచంలో ఎక్కడ పెద్ద స్థాయి క్రీడా ఈవెంట్ జరిగినా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విదేశీ అభిమానులు రావడం సహజం. ఆటలతో పాటు సరదాగా తిరిగేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కానీ రియోలో తాజా పరిణామాలు వారిని భయపెట్టినట్లున్నాయి. సాధారణంగా విదేశీయులు ఆన్‌లైన్‌లో చాలా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే క్రీడల సమయానికి పరిస్థితులు మారిపోయాయి. ఎప్పటినుంచో జికా వైరస్ వారిని వెంటాడుతూనే ఉంది. తాజాగా దోపిడీలు, కిడ్నాపింగ్‌లు, పోలీసు కాల్పులు, బాంబు స్వాధీనంవంటి వార్తలు వారిని మళ్లీ ఆలోచనలో పడేసినట్లున్నాయి. క్రీడా గ్రామం మొదలు క్రీడాకారులపై కూడా దాడులు జరుగుతున్న చోట మనమెంత అని ఆందోళన పెరిగిపోయింది. దాంతో చాలా మంది ఆన్‌లైన్‌లో టికెట్లు రద్దు చేసుకున్నారు. మరో వైపు నిబంధనల ప్రకారం ప్రతీ స్టేడియంలో స్పాన్సర్ల కోసం పెద్ద సంఖ్యలో సీట్లు కేటాయించారు. కానీ వారెవరూ మ్యాచ్‌లు చూసేందుకు రాకపోవడంతో అంతా ఖాళీగా కనిపిస్తోంది. ఈ సీట్లను ఇతరులకు కేటాయించే అవకాశం కూడా లేదు.
 
 అథ్లెటిక్స్‌పై ఆశలు
 ప్రేక్షకుల అసహనాన్ని నిర్వాహకులు కూడా గుర్తించినట్లున్నారు. అందుకే స్టేడియం బయట సుదీర్ఘ క్యూల విషయంలో క్షమాపణలు చెప్పారు. ఇకపై అలాంటివి జరగవని హామీ ఇచ్చారు. పైగా తమ ప్రయత్నంగా స్టేడియాలు నింపే పనిలో పడ్డారు. అమ్ముడుపోని టికెట్లను స్కూల్ విద్యార్థులకు పంచడమే కాదు, వారిని బస్సులో వేదికల వద్దకు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక వారి ఆశలన్నీ శుక్రవారంనుంచి జరిగే ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల మీదే ఉన్నాయి. ఇప్పటి వరకు జనం పెద్దగా రాకపోయినా... అథ్లెటిక్స్‌కు బాగా ఆదరణ ఉంటుందని, అది సూపర్ సక్సెస్ అయితే వేరే లోటు కనిపించకుండా పోతుందని వారు భావిస్తున్నారు. అదే ఆశతోనే బోల్ట్‌తో టికెట్లు కొనమంటూ సందేశం వినిపించారు. ‘నేను రియోలో ఉన్నాను... మిమ్మల్ని నిరాశపర్చను’ అని అతనితో చెప్పించారు. ఈ పోటీలకు జనం ఎగబడితే ఇక నిర్వాహకులు ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని కూర్చొవచ్చేమో. ఒకవేళ బోల్ట్ 100మీ. పరుగు ఫైనల్‌కూ స్టేడియం ఖాళీగా ఉంటే మాత్రం ఈ ఒలింపిక్స్ గురించి చరిత్రలో ఎవరూ చెప్పుకోరు.
 
 టీవీల్లోనూ చూడట్లేదు...
 లండన్ ఒలింపిక్స్‌తో పోలిస్తే రియోలో టీవీ వీక్షకుల సంఖ్య కూడా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా టీవీ హక్కులు కలిగి ఉన్న ప్రసారకర్త ఎన్‌బీసీ చెప్పిన వివరాల ప్రకారం 2016 ఒలింపిక్స్ తొలి ఐదు రోజుల్లో సగటు వీక్షకుల సంఖ్య 28.6 మిలియన్లుగా ఉంది. అయితే లండన్‌లో ఇదే సమయానికి టీవీల్లో ఒలింపిక్స్‌ను 35.6 మిలియన్ల మంది చూశారు. నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంతో రియోను పోలిస్తే వీక్షకుల సంఖ్య 35 శాతం పడిపోవడం విశేషం. అయితే ఈ సారి వెబ్‌లో చూసేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడం దీనికి ఒక కారణంగా చెబుతున్న ఎన్‌బీసీ, రాబోయే రోజుల్లో రేటింగ్స్ పెరుగుతాయని నమ్మకంతో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement