
తిరువనంతపురం: టీ20 మ్యాచుల్లో మహేంద్రసింగ్ ధోనీ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో టీమిండియా బౌలర్, డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న లెజెండ్ ఆటగాడు ధోనీయేనని, జట్టులో అతని సామర్థ్యంపై జట్టులోని సభ్యులకు ఎలాంటి సందేహాలు లేవని భువీ స్పష్టం చేశాడు. టీ-20ల్లో ఆడే సత్తా ధోనీలో లోపించిందని వస్తున్న విమర్శలను కొట్టిపారేశాడు.
పొట్టి ఫార్మెట్ క్రికెట్లో ధోనీ గత కొన్నాళ్లుగా ప్రభావం చూపించలేకపోతున్న సంగతి తెలిసిందే. కివీస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ధోని 37 బంతుల్లో 49 పరుగులు చేసినప్పటికీ అతని సామర్థ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతను క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్లాంటి వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, టీమిండియాలో ధోనీ పాత్రపై ఎలాంటి సందేహానికి తావు లేదని భువీ చెప్పుకొచ్చాడు. 'ధోనీ పాత్ర గురించి ఒక టీమ్గా మేం అంత ఆలోచించడం లేదు. ఆయన రికార్డులు చూడండి. ఆయన లెజెండ్. దేశం కోసం ఎంతో చేశాడు. కాబట్టి ఆయన మీద జట్టులోకి ఎవరికీ ఏ సందేహాలు లేవు' అని భువీ అన్నాడు. రాజ్కోట్లో జరిగిన రెండో టీ-20లో భారత్ ఓటమికి జట్టులో ఐదో స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడమే కారణమా? అని ప్రశ్నించగా.. ఈ ఓటమికి బౌలర్లను బాధ్యులను చేయడం సరికాదని, కివీస్ జట్టు బాగా ఆడటం వల్ల గెలిచిందని భువీ అన్నాడు.