హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా

Jwala Gutta React On Now People Call Her Half Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్‌ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణ గుత్తా జ్వాల తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సక్రమంగా పాటించని అలాంటి వారే కరోనా వైరస్‌ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్‌ కరోనా’ అని కొందరు అనడం జాత్యహంకార చర్యగా అభివర్ణించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనను హాఫ్‌ కరోనా అని పేర్కొనడం, గతంలో ఈశాన్య రాష్ట్ర ప్రజలపై జాత్యహంకార దాడులు జరగడం వంటి విషయాలపై ఆమె స్పందించారు.   

‘నేను సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాను. ఈ క్రమంలో గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిపై ఉమ్మేశారు. ఆ వీడియో వైరల్‌ అయింది. దీంతో నేను వెంటనే దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్‌ చేశా.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్‌ కరోనా, చైనాకా మాల్‌, హాఫ్‌ చైనీస్‌, చింకీ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడు. దీంతో నన్ను హాఫ్‌ కరోనా అని అంటున్నారు. ఇది కూడా జాత్యహంకారమే కదా. 

లాక్‌డౌన్‌లో ఉదయం లేవగానే చూస్తే మన(హైదరాబాద్‌) రోడ్లపై కొందరు విద్యావంతులు జాగింగ్‌ చేయడం చూస్తున్నా. ఆసక్తికర విషయం ఏంటంటే వారే కరోనా వైరస్‌ వ్యాప్తిని ఓ వర్గానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. సినిమాలు, షోస్‌ చూస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటం క్రీడాకారులకు ఒకింత నిరాశ కలిగించేదే. కానీ ఈ సమయంలో అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. అయితే ఒలింపిక్స్‌కు సన్నద్దమయ్యే వారు ఈ సమయంలో శారీరకంగా కంటే మానసికంగా ధృఢంగా ఉండాలి’ అని గుత్తా జ్వాల పేర్కొన్నారు.

ఇక మహమ్మారి కరోనా వైరస్‌ చైనాలో పుట్టి అనేక దేశాలకు పాకింది. ఈ మహమ్మారితో ప్రపంచదేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉండగా.. అనేక వేల మంది మృత్యువాతపడ్డారు. దీంతో చైనా, ఆ దేశ ప్రజలపై సోషల్‌ మీడియావేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం చైనా వైరస్‌ అని పేర్కొని ఆ ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాడు. దీంతో అన్ని దేశాల ప్రజలకు చైనాపై ఓ రకమైన వివక్ష ఏర్పడింది. 

చదవండి:
లాక్‌డౌన్‌: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్‌ అవుతున్నా
ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top