రాజస్తాన్‌ చిత్తు చిత్తుగా..

IPL 2019 KKR beat Rajasthan Royals by 8 wickets - Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్థానిక సవాయ్‌ మాన్‌ సింగ్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆధిపత్యమే నడిచింది. మొదట బౌలింగ్‌లో రాజస్తాన్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయగా.. అనంతరం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. సమిష్టి కృషితో ఆకట్టుకున్న కేకేఆర్‌ ఆతిథ్య రాజస్తాన్‌పై అతిసునాయసంగా గెలిచింది. 

రాజస్తాన్‌ నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. మరో 37 బంతులు మిగిలుండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఛేదనలో సునీల్‌ నరైన్‌(47), క్రిస్‌ లిన్‌(50) బ్యాట్‌ ఝుళిపించారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే ఔటైనప్పటికీ ఊతప్ప(26), గిల్‌(6)లు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడి జట్టుకు విజయాన్నందించారు. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయాస్‌ గోపాల్‌ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 

కేకేఆర్‌ బౌలర్ల కట్టుదిట్టం
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్‌ అజింక్యా రహానే(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం జోస్‌ బట్లర్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత బట్లర్‌(37) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.

అయితే స్మిత్‌ మాత్రం నిలకడగా ఆడాడు. రాహుల్‌ త్రిపాఠీతో కలిసిన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనే స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. రాజస్తాన్‌ స్కోరు 105 పరుగుల వద్ద త్రిపాఠి(6) ఔట్‌ అయ్యాడు. కాగా, స్మిత్‌(73 నాటౌట్‌; 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) చివర వరకూ క్రీజ్‌లో ఉండటంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్‌ బౌలర్లలో గర్నీ రెండు వికెట్లు సాధించగా, ప్రసిద్ద్‌ క్రిష్ణకు వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top