‘ఇమ్రాన్‌ కంటే భారత్‌ గురించే ఎక్కువ తెలుసు’ | India vs Pakistan Series: Akhtar Reacts To Remarks From Kapil Dev | Sakshi
Sakshi News home page

‘ఇమ్రాన్‌ కంటే భారత్‌ గురించే ఎక్కువ తెలుసు’

Apr 12 2020 10:36 AM | Updated on Apr 12 2020 10:36 AM

India vs Pakistan Series: Akhtar Reacts To Remarks From Kapil Dev - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్తాన్‌ వన్డే సిరీస్‌ ఆలోచనపై గత కొద్ది రోజులుగా క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చజరుగుతున్న విషయం తెలిసిందే. కరోనాపై పోరాడటానికి అవసరమైన డబ్బును విరాళాల రూపంలో సేకరించడానికి భారత్, పాకిస్తాన్‌ మధ్య ప్రేక్షకులు లేకుండా మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించాలని షోయబ్‌ అక్తర్‌ ఓ ప్రతిపాదన తీసుకొ​చ్చాడు. అయితే దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. తమకు తగినన్ని డబ్బులు ఉన్నాయని,  డబ్బు కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టేందుకు సిద్ధంగా లేమని పేర్కొన్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కపిల్‌ వ్యాఖ్యలపై అక్తర్‌ స్పందించాడు.  

‘కపిల్‌ భాయ్‌పై నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా వ్యాఖ్యలను ఆయన సరిగా అర్థం చేసుకోలేదనే భావిస్తున్నాను. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నాం. మనందరం కలిసి ఒక చోట చేరి ఆదాయం సమకూ​ర్చే సమయమిది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను కట్టిపడేస్తుంది. డబ్బవసరం లేదని కపిల్‌ పేర్కొన్నాడు. కానీ నా ఆలోచన అతి తక్కువ రోజుల్లో కార్యరూపం దాల్చుతుందని బలంగా విశ్వసిస్తున్నాను.

మా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కంటే భారతీయుల గురించే నాకు ఎక్కువ తెలుసు. భారత్‌లోని అనేక ప్రాంతాల్లో పర్యటించాను. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, ఉత్తరాఖండ్‌ ఇలా అన్ని రాష్ట్రాలు తిరిగాను. అక్కడి ప్రజలతో మాట్లాడాను. అదేవిధంగా భారతీయుల గురించి ఇక్కడ తరుచూ చెబుతుంటాను. మన దేశాల్లో పేదరికం ఎక్కువగా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నేను చూడలేను. ఓ ముస్లింగా, ఓ మనిషిగా నా వంతు సహాయం చేయడానికి ఆరాటపడతాను. ఇక కరోనా, ఇతరాత్ర సేవల కోసం సేకరించే విరాళాల్లో పాక్‌ తర్వాత భారత్‌ నుంచే ఎక్కువగా వస్తాయి’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. 

చదవండి:
‘అక్తర్‌ సూచన మరీ కామెడీగా ఉంది’
ఐపీఎల్‌ నష్టం రూ.3800 కోట్లు! 

Advertisement
 
Advertisement
Advertisement