టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్పై తన అక్కసు వెల్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్ను పూర్తి నాశనం చేసిందంటూ అక్తర్ ఆరోపించాడు.
"ఓ ధనిక పిల్లాడు.. పక్కవీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ చేస్తుంది కూడా అదే. ఇలా క్రికెట్ను భారత్ పూర్తిగా నాశనం చేసింది" అని ఓ ఛానల్ డిబేట్లో అక్తర్ పేర్కొన్నాడు.
కాగా ఫైనల్కు ముందు న్యూజిలాండ్ కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు అక్తర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వైపు భారత్ను విమర్శిస్తునే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై షోయబ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అక్తర్ కొనియాడాడు. మరో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్ సైతం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
చదవండి: మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్


