బంగ్లాను బాదేశారు | India A dominate Bangladesh in drawn warm-up match | Sakshi
Sakshi News home page

బంగ్లాను బాదేశారు

Feb 7 2017 12:10 AM | Updated on Sep 5 2017 3:03 AM

బంగ్లాను బాదేశారు

బంగ్లాను బాదేశారు

పాపం బంగ్లాదేశ్‌... మహా సమరానికి ముందు బేలగా మారిపోయింది. వార్మప్‌ మ్యాచ్‌లో తాము ప్రాక్టీస్‌ చేయాల్సింది పోయి ప్రత్యర్థికి భారీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ అందించింది.

పాపం బంగ్లాదేశ్‌... మహా సమరానికి ముందు బేలగా మారిపోయింది. వార్మప్‌ మ్యాచ్‌లో తాము ప్రాక్టీస్‌ చేయాల్సింది పోయి ప్రత్యర్థికి భారీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ అందించింది. తొలి రోజు బ్యాటింగ్‌ వైఫల్యంతో అంతంత మాత్రం ప్రదర్శన ఇచ్చిన ఆ జట్టు రెండో రోజు బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. భారత ‘ఎ’ ఆటగాళ్లలో ముగ్గురు సెంచరీలతో కదం తొక్కగా, ఏకంగా 5.12 రన్‌రేట్‌తో జట్టు స్కోరు చేసింది. మొత్తంగా వరల్డ్‌ నంబర్‌వన్‌ టీమ్‌తో తలపడాల్సిన సమయంలో ఈ రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బంగ్లాకు  ఏమాత్రం కలిసిరాలేదు.  

ప్రియాంక్, శ్రేయస్, విజయ్‌ శంకర్‌ సెంచరీలు
భారత్‌ ‘ఎ’ 461/8 డిక్లేర్డ్‌  
చేతులెత్తేసిన బంగ్లా బౌలర్లు
ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా   


సాక్షి, హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు ఆటగాళ్లు అదరగొట్టారు. రెండు రోజుల ఈ మ్యాచ్‌ సోమవారం ‘డ్రా’గా ముగియగా, ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్న మన బ్యాట్స్‌మెన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల ఆధిక్యం సాధించడం విశేషం. భారత్‌ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 461 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ప్రియాంక్‌ పాంచల్‌ (148 బంతుల్లో 103 రిటైర్డ్‌ అవుట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (81 బంతుల్లో 103 నాటౌట్‌; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (92 బంతుల్లో 100 రిటైర్డ్‌ అవుట్‌; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలు సాధించారు.

 నితిన్‌ సైని (85 బంతుల్లో 66; 8 ఫోర్లు) రాణించాడు. బంగ్లా బౌలర్లలో శుభాశిష్‌ రాయ్, తైజుల్‌ ఇస్లామ్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 73 పరుగులు చేసింది. తమీమ్‌ (42 నాటౌట్‌) రాణించాడు. షకీబ్‌తో పాటు భారత్‌తో ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న ఇద్దరు ప్రధాన పేసర్లు తస్కీన్‌ అహ్మద్, కమ్రుల్‌ ఇస్లాం కూడా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌కు దిగలేదు. అయితే ప్రధాన స్పిన్నర్‌ అయిన మెహదీ హసన్‌ వేసిన 16 ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్‌ 92 పరుగులు బాదారు.

భారీ భాగస్వామ్యం...
ఓవర్‌నైట్‌ స్కోరు 91/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను పాంచల్, అయ్యర్‌ వేగంగా నడిపించారు. పాంచల్‌ నెమ్మదిగా ఆడగా, అయ్యర్‌ చెలరేగిపోయాడు. ఈ జోడీని విడదీయడానికి బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు సెంచరీ పూర్తి కాగానే అయ్యర్‌ రిటైర్డ్‌ అయి వెళ్లాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 159 పరుగులు జోడించారు.  మరి కొద్దిసేపటి తర్వాత పాంచల్‌ కూడా అయ్యర్‌ను అనుసరిస్తూ శతకం పూర్తి కాగానే ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో రిషభ్‌ పంత్‌ (19), జగ్గీ (23), ఇషాన్‌ (11), హార్దిక్‌ పాండ్యా (7) విఫలమయ్యారు. దాంతో జట్టు స్కోరు 7 వికెట్లకు 287 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో విజయ్‌ శంకర్, సైని చెలరేగిపోయారు. దూకుడుగా ఆడిన వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 115 పరుగులు జత చేశారు. సైని అవుటైన తర్వాత... భారత్‌ మొత్తం 90 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

కుల్దీప్‌కు రెండు వికెట్లు...
తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బంగ్లా ఓపెనర్లు మెరుగ్గా రాణించారు. తమీమ్‌కు జతగా సర్కార్‌ (25) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వరుస బంతుల్లో సర్కార్, మోమినుల్‌ (0)లను అవుట్‌ చేసి బంగ్లాను దెబ్బ తీశాడు. మరో 2 ఓవర్ల తర్వాత ఈ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement