ఇంకా కోలుకోని హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya Will Not Be Available For New Zealand Test Series - Sakshi

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం

న్యూఢిల్లీ: మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హార్దిక్‌ ఇటీవల జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌ ఫిజియో అయిన ఆశిష్‌ కౌశిక్‌తో కలిసి లండన్‌ వెళ్లాడు. అక్కడ తన వెన్నెముకకు సర్జరీ చేసిన డాక్టర్‌ను కలిసి గాయంపై సమీక్ష కోరగా... అతను పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని చెప్పినట్లు బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. దాంతో హార్దిక్‌ బెంగళూరులోని ఎన్‌సీఏ పునరావాస శిబిరంలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేంత వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సెలెక్టర్లు న్యూజిలాండ్‌ పర్యటనలో పాల్గొనే భారత్‌ ‘ఎ’జట్టులో హార్దిక్‌కు మొదట స్థానం కల్పించారు. అయితే అనంతరం నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో అతడు ఫెయిల్‌ అవ్వడంతో అతడిని జట్టు నుంచి తొలగించారు. అంతే కాకుండా అతడి కోసం న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడే టెస్టు సిరీస్‌ కోసం ఇప్పటి వరకు జట్టును కూడా ప్రకటించలేదు. గత ఏడాది అక్టోబర్‌లో సర్జరీ చేయించుకున్న హార్దిక్‌ అప్పటి నుంచి మైదానంలో అడుగు పెట్టలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top