
ఆసియా, కామన్వెల్త్ క్రీడలపై దృష్టి: గీత
గత కొంత కాలంగా అంతర్జాతీయ ఈవెంట్లలో బరిలోకి దిగని రెజ్లర్ గీతా ఫోగట్ త్వరలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపై దృష్టి
ఇండోర్: గత కొంత కాలంగా అంతర్జాతీయ ఈవెంట్లలో బరిలోకి దిగని రెజ్లర్ గీతా ఫోగట్ త్వరలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపై దృష్టి సారించింది. వచ్చే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ టోర్నీకి నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్లోనూ తాను పాల్గొననున్నట్లు తెలిపింది. ‘ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు జరగడానికి మరో ఏడాది మాత్రమే ఉంది. ప్రస్తుతానికి నా దృష్టి అంతా వీటి మీదే ఉంది.
ఈ మెగా ఈవెంట్లలో రాణించడానికి ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాను. మరో నెలలో పూర్తిస్థాయిలో శిక్షణపైనే మనసు లగ్నం చేస్తా’ అని 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత గీత పేర్కొంది. గత జనవరిలో ఢిల్లీకి చెందిన రెజ్లర్ పవన్ కుమార్ను వివాహం చేసుకున్న గీత... తన కెరీర్పై మళ్లీ ఏకాగ్రత సాధించేందుకు ఇక నుంచి నెలలో మూడు లేదా నాలుగు ప్రైవేట్ కార్యక్రమాల్లోనే పాల్గొంటానని తెలిపింది.