అమెరికాను నిలువరించిన భారత్‌

draws for Indian teams against Russia, USA - Sakshi

బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లోని ఆరో రౌండ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. పురుషుల విభాగంలో రెండో సీడ్‌ రష్యా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 2–2తో... మహిళల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాతో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. భారత్, రష్యా జట్ల మధ్య జరిగిన నాలుగు గేమ్‌ల్లో ఫలితం తేలకపోగా... భారత్, అమెరికా జట్ల మధ్య జరిగిన నాలుగు గేముల్లోనూ ఫలితాలు రావడం విశేషం.

ఆనంద్‌–నెపోమ్‌నియాట్‌చి గేమ్‌ 43 ఎత్తుల్లో...  హరికృష్ణ–క్రామ్నిక్‌ గేమ్‌ 45 ఎత్తుల్లో... విదిత్‌–విటియుగోవ్‌ గేమ్‌ 31 ఎత్తుల్లో... ఆధిబన్‌–జావోవెంకో గేమ్‌ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 35 ఎత్తుల్లో జటోన్‌స్కీపై; తానియా 31 ఎత్తుల్లో తతేవ్‌పై నెగ్గారు. అయితే ఏపీ గ్రాండ్‌మాస్టర్‌ హారిక 57 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌ చేతిలో... ఇషా 55 ఎత్తుల్లో జెన్నిఫర్‌ చేతిలో ఓడిపోయారు. ఆరో రౌండ్‌ తర్వాత భారత పురుషుల జట్టు 9 పాయింట్లతో 14వ స్థానంలో... భారత మహిళల జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top