టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

Dabang Delhi beat Telugu Titans in thriller - Sakshi

దబంగ్‌ ఢిల్లీ చేతిలో పాయింట్‌ తేడాతో పరాజయం

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా మూడో పరాజయంతో హ్యాట్రిక్‌ నమోదు చేసింది. కానీ ఈ సారి గెలిచేందుకు చివరిదాకా కష్టపడింది. మ్యాచ్‌ ముగిసే దశలో కాస్త ఉత్కంఠరేపినా... స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకున్న దబంగ్‌ ఢిల్లీ కేసీ జట్టు 34–33తో తెలుగు టైటాన్స్‌పై గట్టెక్కింది. కేవలం పాయింట్‌ తేడాతో టైటాన్స్‌ పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్‌ దేశాయ్‌ నిరాశపరిచాడు. జట్టు తురుపుముక్కగా బరిలోకి దిగిన ఈ రైడర్‌ 13 సార్లు కూతకు వెళ్లి కేవలం 8 పాయింట్లే చేశాడు. ఇతని సోదరుడు సూరజ్‌ దేశాయ్‌ అదరగొట్టాడు. 15 సార్లు రైడింగ్‌కు వెళ్లి 18 పాయింట్లు తెచ్చిపెట్టాడు. స్టార్‌ డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ కూడా నిరాశపరిచాడు. ప్రత్యర్థి రైడర్లను పట్టేందుకు 7 సార్లు కష్టపడిన భరద్వాజ్‌ కేవలం 4 పాయింట్లే సాధించాడు. మిగతా ఆటగాళ్లలో అమిత్‌ 2 పాయింట్లు చేశాడు. దబంగ్‌ ఢిల్లీ జట్టులో రైడర్లు నవీన్‌ కుమార్‌ (14 పాయింట్లు), చంద్రన్‌ రంజీత్‌ (6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డిఫెండర్లలో జోగిందర్‌ నర్వాల్‌ (4), రవీందర్‌ పహల్‌ (3) రాణించారు.  

యూపీ యోధ చిత్తుగా...
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధ 17–48 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. రైడర్లు మొహమ్మద్‌ నబీబ„Š  (10), మణిందర్‌ సింగ్‌ (9) చెలరేగారు. డిఫెండర్లు కూడా తమ వంతుగా రాణించడంతో బెంగాల్‌ స్కోరు అమాంతం పెరిగింది. బల్‌దేవ్‌ సింగ్‌ 7, రింకూ నర్వాల్‌ 4, జీవా కుమార్‌ 3 పాయింట్లు సాధించారు. యూపీ యోధ తరఫున మోను గోయత్‌ (6), సురేందర్‌ సింగ్, నితీశ్‌ కుమార్‌ చెరో 3 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు తలపడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top