వాంఖేడెలో కాదు బ్రాబౌర్న్‌లో 

Brabourne Stadium to host India-WI ODI - Sakshi

వేదిక మారిన భారత్, విండీస్‌ నాలుగో వన్డే  

ముంబై: వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌–వెస్టిండీస్‌ మధ్య ఈ నెల 29న జరగాల్సిన నాలుగో మ్యాచ్‌ వేదిక మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ వన్డేకు ముంబైలోని వాంఖేడె మైదానం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) చేతులెత్తేసింది. ఎంసీఏ అధికారులు గురువారం బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరిని కలిసి తమ ఇబ్బందులను వివరించి, మ్యాచ్‌ను బోర్డు నిర్వహించేలా చూడాలని కోరారు. దీంతో క్రికెట్‌ పాలకుల కమిటీ (సీవోఏ) సూచన మేరకు మ్యాచ్‌ను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని బ్రాబౌర్న్‌ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ తెలిపింది.

బ్రాబౌర్న్‌... వాంఖేడెకు అతి సమీపంలోనే ఉంటుంది. 2009లో ఆస్ట్రేలియాతో టెస్టు తర్వాత ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. అప్పటి నుంచి ఎక్కువగా పర్యాటక జట్ల ప్రాక్టీస్‌ కోసం వాడుతున్నారు. మరోవైపు సిరీస్‌లో వన్డే వేదిక మారడం ఇది రెండోసారి. ఈ నెల 24న ఇండోర్‌లో జరగాల్సిన రెండో వన్డేను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం కారణంగా విశాఖపట్టణానికి తరలించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top