ఆసీస్కు ఓదార్పు విజయం
లండన్: యాషెస్ సిరీస్ను ఇప్పటికే ఓడిపోయిన ఆస్ట్రేలియా నామమాత్రమైన చివరి టెస్టులో ఓదార్పు విజయం సాధించింది. ఇంగ్లండ్తో చివరి, ఐదో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 46 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ 3-2తో సిరీస్ను సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్మిత్కు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును రోజర్స్ (ఆసీస్), రూట్ (ఇంగ్లండ్)కు సంయుక్తంగా ఇచ్చారు.
ఐదో టెస్టులో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఫాలోఆన్ ఆడిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టులో కుక్ (85) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లు సిడిల్ నాలుగు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ రెండేసి వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ల్లో ఆస్ట్రేలియా 481 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 149 పరుగులకు ఆలౌటైంది. క్లార్క్, రోజర్స్కు ఇదే చివరి టెస్టు. వీరిద్దరూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.