సశేషం! | Auction of broadcast media | Sakshi
Sakshi News home page

సశేషం!

Apr 5 2018 1:20 AM | Updated on Apr 5 2018 1:20 AM

Auction of broadcast media - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ప్రస్తుతానికి ఐపీఎల్‌ మ్యాచ్‌ను దాటిపోయాయి! రెండో రోజు బుధవారం కూడా కొనసాగిన ఈ–వేలంలో హక్కుల కోసం పోటీ తీవ్రంగా సాగింది. ఫలితంగా వేలం ఆగిపోయే సమయానికి గ్లోబల్‌ కన్సాలిడేటెడ్‌ రైట్స్‌ (జీసీఆర్‌) ఏకంగా రూ. 6302.5 కోట్లకు చేరుకున్నాయి. భారత్‌లో 2018–2023 మధ్య జరిగే 102 మ్యాచ్‌ల కోసం ఈ వేలం జరుగుతోంది. దీని ప్రకారం చూస్తే ఒక్కో మ్యాచ్‌కు రూ.59.16 కోట్లు చెల్లించేందుకు ఇప్పటికే ప్రసారకర్తలు సిద్ధమైపోయినట్లు. గురువారం కూడా వేలం కొనసాగనున్న నేపథ్యంలో ఈ విలువ ఎంత వరకు చేరుతుందో ఊహించలేని పరిస్థితి! ముగిసిన గత ఒప్పందంలో స్టార్‌ ఒక్కో మ్యాచ్‌కు రూ. 43 కోట్లు చెల్లించింది.

అంటే ఇప్పటికే ఒక్కో మ్యాచ్‌కు రూ. 16.16 కోట్లు ఈ మొత్తం పెరిగిపోయింది. మొత్తం హక్కుల విలువను గతం (రూ. 3,851 కోట్లు)తో పోలిస్తే ఇప్పుడు 56.6 శాతం పెరిగిపోయింది. గత సెప్టెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం స్టార్‌ సంస్థ ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌కు రూ. 54.5 కోట్లు చెల్లిస్తోంది. బుధవారం రూ.4,442 కోట్ల నుంచి కొనసాగిన వేలంలో మూడు సంస్థలు కూడా పోటీ పడుతూ చివరకు రూ. 6032.5 కోట్లకు చేర్చాయి. ‘భారత క్రికెట్‌ శక్తి ఏమిటో ఈ వేలం చూపిస్తోంది. పెను వివాదాలు వచ్చినా తట్టుకునే శక్తి మన క్రికెట్‌కు ఉంది. మన దేశంలో పెట్టుబడికి తగిన లాభం తెచ్చిపెట్టే శక్తి ఒక్క ఆటకే ఉందని బిడ్డర్లకు తెలుసు కాబట్టే అంతగా పోటీ పడుతున్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement