జన్మభూమి సభలా.. అధికార పార్టీ సమావేశాలా..?

ప్రోటోకాల్‌ లేని నాయకులను వేదికలపైకి ఎక్కించడం దారుణం

ఆర్భాటల కోసం  ప్రజాధనం దుర్వినియోగం చేసిన చంద్రబాబు సర్కారు

సభల్లో ప్రశ్నించిన వారిపై దాడులు తెగపడే విష సంస్కృతికి బీజం వేసిన టీడీపీ

విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నాయకులు

విజయనగరం మున్సిపాలిటీ:   ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి సభలు ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా... అధికార పార్టీ సమావేశాలుగా నిర్వహించడం దారుణమని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక సత్యకార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు బెల్లాన చంద్రశేఖర్,  శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యలు మాట్లాడారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు చంద్రబాబు సర్కారు నిర్వహించిన ఐదోవిడత జన్మభూమి కార్యక్రమం తీరును తుర్పూరబట్టారు.  ప్రోటోకాల్‌ లేని టీడీపీ నాయకులను వేదికలపైకి ఎక్కించి స్థాయిగల అధికారులను కిందన కూర్చుండబెట్టడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దళితులపై భౌతిక దాడులకు పాల్పడే విష సంస్కృతిని ప్రోత్సహించటం  దారుణమన్నారు.

సభల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత నాలుగు విడతల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 32వేల 363 దరఖాస్తులు రాగా.. అందులో 48వేల 565 పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రేషన్‌కార్డుల కోసం 22000 దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం మంజూరు చేసినవి మాత్రం 5245 మాత్రమేనన్నారు. పింఛన్ల కోసం 9000 దరఖాస్తులు నమోదుకాగా మొండిచేయి చూపారన్నారు. లక్ష మంది పేదలకు నివాసగృహాలు అవసరంగా గుర్తించగా ఇప్పటి వరకు కేవలం 6,047 మందికి మాత్రమే మంజూరు చేయడం విచారకరమన్నారు. జిల్లా పరిషత్‌లో అధికారులపై, గజపతినగరంలో జరిగిన జన్మభూమి సభలో వెలుగు ఏపీఎంపై  అధికార పార్టీ నాయకులపై దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. జిల్లాలో విధులు నిర్వహించేందుకు అధికారులు భయపడుతున్నారన్నారు.  

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా నిలుస్తా ...
పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని 1,75,000 మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ  సభ్యుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ పాలనలో జరిగిన మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారని, తెల్లదొరలకు అభివర్ణించుకుంటున్న అధికార పార్టీ నాయకులను త్వరలోనే తరిమికొడతారన్నారు. తాగి వచ్చే భర్తలకు అన్నం పెట్టవద్దని సూక్తులు చెబుతున్న అశోక్‌గజపతిరాజు వారి ప్రభుత్వంలో విచ్చలవిడగా వెలసిన మద్యం షాపులు, బెల్టుదుఖాణాలు కోసం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు,  కె.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఉప్పాడ సూర్యనారాయణ, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, పతివాడ అప్పలనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భైరెడ్డి ప్రభాకకరెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ గాడు అప్పారావు,  పిన్నింటి చంద్రమౌళి, ముల్లు త్రినా«థ్, పిలక శ్రీనివాసరావు, పిళ్లా రామకృష్ణ, గంటా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top